ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇటీవల శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు ఎనిమిది రోజుల పాటు కస్టడీకి తీసుకుని, విచారించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి, ప్రస్తుత సర్కారు లోనూ మంచి పొజిషన్లో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి పేరును శివ బాలకృష్ణ వెల్లడిస్తూ వాంగ్మూలం (కన్ఫెషన్) ఇచ్చినట్లు సమాచారం. శివ బాలకృష్ణ కన్ఫెషన్ను రికార్డు చేసిన ఏసీబీ, ఇప్పుడు సదరు ఐఏఎస్ కు నోటీసులు జారీ చేసి, విచారించాలని నిర్ణయించింది.
అందు కోసం అనుమతి నివ్వాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం కూడా ఈ కేసును సీరియ్స్ గా తీసుకున్న నేపథ్యంలో ఏసీబీకి అనుమతినిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే శివ బాలకృష్ణ ఫోన్ ను సీజ్ చేసి, కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) ను సేకరించగా సదరు ఐఏఎస్ అధికారితో జరిగిన సంభాషణలు, చాటింగ్ వివరాలను (ఇంకా కొంత డేటాను రిట్రీవ్ చేయాల్సి ఉంది) వెలికి తీస్తోంది. వందల కోట్ల రూపాయల అక్రమాలు, మనీ లాండరింగ్ జరగడంతో ఈ కేసులో పీఎంఎల్ఏ కింద విచారణ చేపట్టేందుకు ఈడీ అధికారులు రంగం లోకి దిగనున్నట్లు తెలిసింది.
ఏసీబీ దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చాక కేసు పత్రాలను తెప్పించుకుని, విచారించనున్నట్లు సమాచారం. ఈ కేసులో శివ బాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారంపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు ఇప్పటికే దృష్టి సారించారు. ఇటీవలి విచారణలో శివ బాలకృష్ణ తన బంధు మిత్రులను బినామీ లుగా వాడుకున్నట్లు తేలడంతో ‘బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్-2018’ కింద చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆ అధికారి సూచించిన మేరకే అక్రమంగా సంపాదించిన డబ్బుతో శివ బాలకృష్ణ వరంగల్ వైపు భూములను కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది.
కోర్టుకు సమర్పించిన కన్ఫెషన్ రిపోర్టులో ఏసీబీ అధికారులు సదరు ఐఏఎస్ పేరును ప్రస్తావించినట్లు తెలిసింది. ఏసీబీ కస్టడీలో.. శివ బాలకృష్ణ తన ఆస్తుల వివరాలు, బినామీల పేర్లు, ఎవరి ఆదేశాల మేరకు ఈ పనులు చేశారు.? అధికారులకు ముట్ట జెప్పిందెంత.? అనే వివరాలను పూస గుచ్చినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఐఏఎస్ అధికారి పేరు రావడంతో.. కేసు కీలక మలుపు తిరిగింది.