రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు బాసటగా త్వరలో గుంటూరు జిల్లా నియోజకవర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులకు సంఘీభావంగా జనవరి 1వ తేదీన జరుపుకోవాల్సిన కొత్త సంవత్సరం వేడుకలను బహిష్కరిస్తున్నట్లు నరసరాపుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, జేఏసీ కన్వీనర్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు.
ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరికి వారు పొంతనలేని ప్రకటనలు చేస్తూ అమరావతిని స్మశానంతో, ఎడారితో పోలుస్తున్నారని ఆయన అన్నారు. వైసిపి మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రజలు చీదరించుకుంటున్నారని ఆయన అన్నారు. రైతులు, రాష్ట్ర ప్రజానీకం సంఘటితంగా పోరాడితే వైసిపి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వీలుంటుందని ఆయన అన్నారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అరవిందబాబు అన్నారు.