సగరకుల ఆత్మ గౌరవ భవన నిర్మాణ పనులకు మంత్రులు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ నేడు శంకుస్థాపన చేశారు. రాజేంద్రనగర్ లోని కోకపేటలో 2 ఎకరాల భూమిలో రూ. 2 కోట్ల నిధులతో సగరకుల ఆత్మ గౌరవ భవనం నిర్మిచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ వకులాబారణం కృష్ణమోహన్, సగర కుల సంఘం రాష్ట్ర నాయకులు మారుతి సాగర్, శేఖర్ సాగర తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని కుల వృత్తుల ఆత్మ గౌరవం పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కుల వృత్తుల ప్రోత్సాహంలో భాగంగా సగర కులస్తుల సైతం అర్హులైన వారందరికి 100% సబ్సిడీతో లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచంలోనే అద్భుతంగా పేరుగాంచిన ఇంటింటికి మంచినీళ్లు అందించే తెలంగాణ రాష్ట్ర పథకం మిషన్ భగీరథకు సగర కులస్తుల దైవం భగీరథ పేరు పెట్టి సీఎం కేసీఆర్ గౌరవించారు. ట్యాంక్ బండ్ పై భగీరథుని విగ్రహం కోసం కృషి చేస్తాం. సగర కులస్తులను బిసి – డి నుండి బీసీ – ఏ గ్రూపులో చేర్చాలన్న డిమాండ్ ను సీఎం కేసీఆర్ కు నివేదిస్తాం అని మంత్రి తెలిపారు.