భైంసా ఏరియా ఆసుపత్రి లో కరోనా రోగులకు చికిత్స అందించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యంగా ఆక్సిజన్ నిలువలు ఉండే విధంగా చూసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు.
బైంసా ఏరియా ఆసుపత్రి, కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం నాడు ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
ఆయా కేంద్రాలలో కరోనా నివారణకు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి, కరోనా రోగులకు అందిస్తున్న సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
వ్యాక్సిన్ ప్రాముఖ్యత, ప్రాధాన్యత గురించి ప్రజల్లో అవగాహన కలిగించి, అర్హులైన అందరికీ వ్యాక్సిన్ అందించాలని, కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండాలని కలెక్టర్ కోరారు.
80 శాతం మంది సాధారణ మందులు వాడటం వల్లనే పూర్తిగా కోలుకుంటారని ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లాలో కరోనా రోగులకు ప్రత్యేకంగా సేవలు అందిస్తున్న ఆసుపత్రులకు వెళ్లాలని అన్నారు.
కలెక్టర్ వెంట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధన రాజు, డి ఎస్ ఓ డాక్టర్ అరుణ్ ఇతర సిబ్బంది ఉన్నారు.