నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. బుధవారంనాడు కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సంక్షేమ పథకాల అమలు, పట్టణ ప్రగతి పై అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఉద్యాన వన శాఖ ద్వారా కూరగాయల సాగు, మామిడి, నిమ్మ, దానిమ్మ, జామ తదితర తోటల పెంపకం చేపట్టాలని , పశు సంవర్ధక శాఖ ద్వారా గొర్రెల పంపిణీ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. అలాగే మత్స శాఖ ద్వారా చెరువులు, కుంటలలో చేపపిల్లల పెంపకం ద్వారా మత్స్య కారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
పట్టణ ప్రగతి లో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయుటకు మున్సిపల్ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజా మరుగుదొడ్లు, సమీకృత మార్కెట్ యార్డు, పార్కులు నిర్మించేందుకు వెంటనే స్థలాలను గుర్తించాలన్నారు.
అక్రమ లేఅవుట్ల ను వెంటనే తొలగించాలన్నారు. ఆస్తి పన్ను వంద శాతం వసూలు చేయాలన్నారు. రోడ్లు, డ్రైనేజీ లను శుభ్రంగా ఉంచాలని, వార్డుల వారీగా మొక్కలు నాటేందుకు నర్సరీల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, జిల్లా పశుసంవర్ధక శాఖ రమేష్ కుమార్, జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి శరత్ కుమార్, జిల్లా మత్స్య శాఖ అధికారి దేవేందర్, నిర్మల్ మున్సిపల్ కమిషనర్ ఎన్. బాలకృష్ణ, డీఈ సంతోష్ కుమార్ , వినయ్ తదితరులు పాల్గొన్నారు.