వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని రాహుల్గాంధీ ఎప్పుడో తేల్చి చెప్పారని టీపీసీసీ చీఫ్ రేవంత్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్తో స్నేహం ధృతరాష్ట్ర కౌగిలే అని ఆయన ఎద్దేవా చేశారు. ఈసారి జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పైకి మూడు పార్టీల మధ్య పోటీగా కనిపించినా.. చివరకు మిగిలేది రెండు పక్షాలేనని, అందులో పైచేయి సాధించేది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ నిజ స్వరూపాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారని, ఈసారి ఆయనకు కేవలం పాతిక సీట్లతోనే సరిపెట్టే వాతావరణం ఉన్నదన్నారు. కాంగ్రెస్కు మాత్రం 80 సీట్లు ఖాయమని, బీజేపీ సింగిల్ డిజిట్ కోసం కొట్లాడాల్సిందేనని అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందడానికి సాయుధ పోరాటం చేసినట్లుగా ఇప్పుడు కేసీఆర్ పాలనను పారదోలడానికి రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు డిసైడ్ అయిపోయారని అన్నారు.
కేసీఆర్కు దావూద్ ఇబ్రహీం ఆదర్శ పురుషుడేమోనంటూ సెటైర్ వేసిన రేవంత్.. కేజ్రీవాల్ తరహా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పాదయాత్రలు చేసిన తర్వాత ప్రజల నాడి తనకు అర్థమైందని, 80% మంది ప్రజలు కేసీఆర్ను ఓడించాలనే కసితో ఉన్నారని, అందువల్లనే ఆయన గ్రాఫ్ 25 సీట్ల దగ్గరే ఆగిపోతుందన్నారు. చివరకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక పక్షంగా ఉంటాయని, మరో పక్షంగా ఉన్న కాంగ్రెస్ 80 సీట్లతో గెలిచి పవర్లోకి వస్తుందన్నారు. సర్వేలతో తనకు సంబంధం లేదని, ప్రజల నాడే తనకు కొలమానం అని అన్నారు. బీజేపీతో కొట్లాడినట్లుగా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ను నాశనం చేయడం కోసమేనని, అందువల్ల ఆ రెండు పార్టీలకు చేదు అనుభవం తప్పదని, ప్రజలు ఎవరివైపు ఉన్నారో స్పష్టమవుతున్నదన్నారు.