అసైన్డ్ భూములను మంత్రి ఈటల ఆక్రమించినట్లు ప్రాధమిక సాక్షాలు లభించాయి. ఈ నివేదిక ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరిన వెంటనే మంత్రి పదవి నుంచి ఈటలను బర్తరాఫ్ చేసే అవకాశం ఉంది.
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి మెదక్ జిల్లా అచ్చంపేటలో విజిలెన్స్ అధికారులు ఈ ఉదయం విచారణ ప్రారంభించారు. మంత్రిపై ఫిర్యాదులు చేసిన రైతుల నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈటల అసైన్డ్ భూముల కబ్జా చేశారని నిన్న సీఎం కేసీఆర్కు రైతులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రైతుల ఫిర్యాదుపై కేసీఆర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు విచారణలో విజిలెన్స్ ఎస్పీ మనోహర్ పాల్గొన్నారు.
అచ్చంపేటలో తుప్రాన్ ఆర్డీవో రాంప్రకాశ్ ఆధ్వర్యంలో అధికారులు భూములను సర్వే చేస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలు ఈ సర్వే చేస్తున్నాయి. ఈటలకు చెందిన హేచరీస్లో డిజిటల్ సర్వే కొనసాగుతోంది.
దీంతో పాటు హేచరీస్కు పక్కన ఉన్న అసైన్డ్ భూముల్లోనూ అధికారులు డిజిటల్ సర్వే చేస్తున్నారు. తుప్రాన్ డీఎస్పీ కిరణ్కుమార్ నేతృత్వంలో మంత్రి ఈటల ఫామ్ హౌస్ సమీపంలో పోలీసులు భారీగా మోహరించారు. మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ క్షేత్ర స్థాయిలో జరిపిన విచారణలో అసైన్డ్ భూములను మంత్రి కబ్జా చేసినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. ఈ మేరకు ముఖ్యమంత్రికి కొద్ది సేపటిలో ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్నారు.