పెట్టుబడిదారీ వ్యవస్థ వున్నంత వరకు శ్రమదోపిడీ, ఎక్కువ పనిచేయించుకోవడం సర్వసాధారణం. కార్మిక చట్టాలను ఐ.టి. రంగంలో కూడా అమలు చేయాలనే పోరాటం ఈనాడు అత్యంత అవసరం. కార్మిక చట్టాలు అమలు చేయబోమని పాలకవర్గాలు బహుళజాతి కంపెనీలకు హామీలిస్తూ దేశంలోకి స్వాగతిస్తున్నాయి.
అసంఘటిత రంగంలో అయితే సరేసరి. ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్టు, పార్ట్టైం ఉద్యోగుల పేరుతో ప్రవేశపెట్టిన ఔట్ సోర్సింగ్లోను కార్మిక చట్టాల నియమాలు అమలులో లేవు. ఇది కార్మిక హక్కులకు తీరని నష్టం చేస్తున్నదని శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ఒప్పంద పొరుగు సేవల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ గుండబాల మోహన్ అన్నారు.
వ్యవస్థలో రెగ్యులర్ ఉద్యోగుల కన్నా కాంట్రాక్టు ఉద్యోగులే అధికమయ్యారని, ప్రభుత్వరంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయిందని ఆయన అన్నారు. నిరుద్యోగాన్ని, బలహీనతలను ఆసరా చేసుకొని కాంట్రాక్టు ఉద్యోగులతో 10,12 గంటలు పనిచేయిస్తున్నారని ఆయన అన్నారు.
విద్యా, వైద్య రంగాల్లో ప్రయివేటీకరణ పెరిగి శ్రమదోపిడీ అధికం అవుతున్నదని ఆయన తెలిపారు. 1886లో ఆరంభమైన మేడే ఉద్యమం వందేళ్ళ పండగ జరుపుకుంటున్న ఈ దశలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం దురదృష్టకరమని ఆయన అన్నారు.