టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం అవివేకమని ఆయన అన్నారు.
విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన వై ఎస్ జగన్ ను ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేశారని, ఏపిలో కూడా పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ ఇటువంటి పరిస్థితిలో పిల్లలను పరీక్షలకు పంపుతారా? లేక మంత్రులు పంపుతారా? అని ప్రశ్నించారు. ‘‘మీ పిల్లలవే ప్రాణాలా?’’ అని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సునామీ కన్నా ప్రమాదకరంగా మారిందన్నారు.
దేశంలో ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కుంభమేళా జరిపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఉధృతికి దారితీసిందని విమర్శించారు. ఎన్నికల సమయాల్లో బహిరంగ సభలు, దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు.
ఏపీకి ఆక్సిజన్, వాక్సిన్, కిట్లు పంపించాలని పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, విదేశీ నేతలను కోరినట్లు తెలిపారు. పరీక్షలపై ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోకుంటే విద్యార్థులు కరోనాకు బలైపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇప్పుడు రాష్ట్రంలో కావాల్సింది రాజకీయ పోటీ, ఫైటింగ్ కాదని… ప్రజలు, విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమని హితవు పలికారు.