తిరుమల తిరుపతి దేవస్థానం వేలం వేస్తున్న 50 ఆస్తులు దేవస్థానానికి ఏమాత్రం ఉపయోగపడి కాదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. కొన్ని టివి ఛానళ్ళలో ఈ విషయానికి సంబంధించి అవాస్తవ సమాచారంతో భక్తుల్లో గందరగోళం ఏర్పడిందనీ ఆయన తెలిపారు.
దేవస్థానం ఆస్తులను విక్రయించడం, లీజుకు ఇవ్వడం లాంటి అధికారాలు టిటిడి బోర్డుకే ఉన్నాయని చెప్పారు. బోర్డు నిర్ణయాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. దేవస్థానం నిరర్థక ఆస్తుల అమ్మక ప్రక్రియ 1974 నుండి జరుగుతోందన్నారు.
ఇంతకు ముందు కూడా ఆస్తులు అమ్మారు
2014 వరకు 129 ఆస్తులను బహిరంగ వేల ద్వారా విక్రయించారని ఆయన అన్నారు. ఇదే క్రమంలో చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షులుగా ఉన్నపాలకమండలి నిరర్ధక ఆస్తులను గుర్తించి బహిరంగ వేలం ద్వారా వాటిని విక్రయించడానికి గల అవకాశాలను పరిశీలించడానికి ఒక సబ్ కమిటీని నియమించినట్లు చైర్మన్ చెప్పారు.
ఈ సబ్ కమిటీలో అప్పటి పాలక మండలి సభ్యులు జి.భాను ప్రకాష్రెడ్డి, జె.శేఖర్, డి.పి.అనంత, ఎల్లా సుచరిత, సండ్ర వెంకట వీరయ్య లను సభ్యులుగా నియమించారన్నారు. అప్పటి సబ్ కమిటీ నివేదిక మేరకు , అప్పటి తీర్మానం నెం. 253 తేదీ 30 – 01- 2016 ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో సబ్ కమిటీ గుర్తించిన 50 నిరర్థక ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి చదలవాడ కృష్ణమూర్తి ఆధ్యక్షతన గల పాలక మండలి ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
చదలవాడ సమయంలోనే ప్రక్రియ మొదలు
ఈ తీర్మానం మేరకు దేవస్థానం సిబ్బంది ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాలలోని 17 ఆస్తులు, పట్టణ ప్రాంతాలలోని 9 ఆస్తులు, తమిళనాడు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న 23 ఆస్తులకు సంబంధించి సబ్రిజిస్టార్ కార్యాలయాల రికార్డులలోని విలువ, బహిరంగ మార్కెట్ విలువలను సేకరించి పాలకమండలికి నివేదించారని ఆయన తెలిపారు.
ఒక ఆస్తికి సంబంధించి కోర్టు కేసు ఉండటంతో వేలం ప్రక్రియ నుంచి మినహాయించారు. అలాగే రుషికేష్లో ఒక ఎకరా 20 సెంట్ల భూమి వల్ల టిటిడికి ఎలాంటి ఉపయోగం లేకుండా దురాక్రమణకు గురయ్యే ప్రమాదం ఉండటంతో దీన్ని కూడా వేలం జాబితాలో చేర్చినట్లు చెప్పారు.
ఈ ఆస్తుల వల్ల దేవస్థానానికి ఉపయోగం లేదు
పై తీర్మానం మేరకు 50 నిరర్థక ఆస్తుల విలువను రూ. 23.92 కోట్లుగా ప్రస్తుత పాలక మండలి తీర్మానం నెం.309 తేదీ 29-02 – 2020 ద్వారా ధర నిర్ణయిస్తూ గత పాలక మండలి నిర్ణయాలను అమలు చేయదానికి ఆమోదం మాత్రమే తెలిపామన్నారు. ఈ ఆస్తులు దేవస్థానానికి ఏవిధంగాను ఉపయోగపడేవి కాదన్నారు.
ఆ నిరర్థక ఆస్తులు 1 నుంచి 5 సెంట్ల లోపు ఉన్న ఖాళీ ఇంటి స్థలాలు, 10 సెంట్ల నుంచి ఎకరం లోపు విస్తీర్ణం ఉన్న వ్యవసాయ భూములుగా ఉన్నాయన్నారు. వీటివలన దేవస్థానానికి ఎలాంటి ఆదాయం లేక పోగా, ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉన్నందువల్ల ఈ ఆస్తులను బహిరంగ వేలము ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ప్రభుత్వానికి లింకు పెట్టడం కరెక్టు కాదు
అయితే కొన్ని ప్రసార సాధనాలు టిటిడి ఆస్తుల వేలం విక్రయానికి సంబంధించి గత పాలక మండలి తీసుకున్న , పై కమిటీలు తీసుకున్న నిర్ణయాలకు , ప్రభుత్వానికి లింకు పెట్టడం సరికాదని వైవి చెప్పారు. వాస్తవాలు ఇలా ఉండగా కొన్ని ప్రసార సాధనాలు అవాస్తవ సమాచారం తో కథనాలు ప్రసారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం మంచి పద్ధతి కాదని సుబ్బారెడ్డి చెప్పారు.