దేశంలో న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయని విదేశాలలో కుట్రపూరితంగా బలమైన ప్రచారం చేస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత న్యాయవ్యవస్థ స్థాయిని ఎవరూ ఎప్పటికీ న్యూనత పరచలేరని ఆయన అన్నారు. అదే విధంగా న్యాయమూర్తుల ప్రవర్తనను సమీక్షించే అర్హత రాజకీయ, రాజకీయేతర పక్షాలకు ఉండదని కూడా ఆయన అన్నారు.
ఒడిశాలోని భువనేశ్వర్లో కేంద్ర ప్రభుత్వ న్యాయ అధికారుల సదస్సులో నేడు న్యాయశాఖ మంత్రి ప్రసంగించారు. భారత వ్యతిరేక విదేశీ శక్తులు, తుక్డే తుక్డే గ్యాంగ్ సహాయంతో భారత్ లోని వ్యవస్థలపై దాడి చేస్తున్నాయని ఆయన అన్నారు. భారత న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉందని, ప్రతిపక్ష పాత్ర పోషించాలని న్యాయవ్యవస్థను ఎన్నటికీ బలవంతం చేయలేమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
ప్రజాస్వామ్యం మన రక్తంలో ఉంది కాబట్టి భారత ప్రజాస్వామ్యాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. స్వేచ్ఛ పేరుతో ఎవరూ ఏమీ చేయలేరని, ఇదే జరిగితే శాంతిభద్రతలు ఏమవుతాయని రిజిజు ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సంపూర్ణ పునరుజ్జీవన యాత్రను ప్రారంభించిందని ఆయన తెలిపారు. తుక్డే-తుక్డే ముఠా సభ్యులు ఈ విషయం అర్థం చేసుకోవాలని న్యాయ మంత్రి అన్నారు.
ఈ ముఠాలు భారత వ్యతిరేక విదేశీ శక్తుల నుండి సహాయం పొందుతాయి. ఈ శక్తులు భారత ప్రజాస్వామ్యం, భారత ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మరియు ఆర్మీ, ఎన్నికల సంఘం మరియు దర్యాప్తు సంస్థల వంటి ఇతర ముఖ్యమైన సంస్థలపై దాడి చేస్తూనే ఉన్నాయి అని ఆయన అన్నారు. అయితే దీనివల్ల వారు సాధించేది ఏదీ ఉండదని వెల్లడించారు. భారత న్యాయవ్యవస్థ ఇబ్బందుల్లో ఉందని దేశంలోనూ, బయటా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను మంచివారు, చెడ్డవారు అనడం దురదృష్టకరమని, ప్రభుత్వంపై ఇలాంటివి జరిగితే స్వాగతిస్తామని, అయితే న్యాయవ్యవస్థపై ఇలాంటి విమర్శలు చేయడం సరైన సంకేతం కాదన్నారు. భారతదేశాన్ని సురక్షితంగా మార్చాలనుకున్నప్పుడు, కఠిన చట్టాలను రూపొందించాలని న్యాయ మంత్రి న్యాయ కోవిదులకు సూచించారు. ఒక బాడీ బిల్డర్ ఆకృతిని పొందడానికి ఎంత చెమటలు పట్టాల్సి ఉంటుందో, అదేవిధంగా మనం స్వేచ్ఛ మరియు హక్కులను పొందేందుకు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది అని ఆయన అన్నారు.