పశువులు అక్రమ రవాణా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం. దీపిక హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణాను జిల్లాలో నియంత్రించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పశువుల అక్రమ రవాణాదారుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. పశువుల అక్రమ రవాణా నిరోధించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.
విజయనగరం ట్రాఫిక్ డిఎస్పీ డి. విశ్వనాధ్ నోడల్ అధికారిగా నియమించామని తెలియజేశారు. పశువుల అక్రమ రవాణాపై ఏదైనా సమాచారం తెలిసినా నోడల్ అధికారికి తెలియజేయాలన్నారు. జిల్లాలో అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలను గుర్తించి, వాటిపై కఠిన చర్యలు తీసుకొని చట్టపరంగా వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో సంబంధిత పోలీసు అధికారులు కూడా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాలన్నారు. పశువుల అక్రమ రవాణాదారులపై జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 17 కేసులు నమోదు చేసి 24 మందిని అరెస్టు చేసి, 239 పశువులను, 19 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.