తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసిన భక్తులందరూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. అసలు ఈ సమావేశాన్ని ధర్మకర్తల మండలి సమావేశం అంటారా? అని భక్తులు అడుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో క్రికెట్ ప్లేయర్ ల కోసం “స్పాన్సర్స్” అందరూ ఒకచోట చేరి పోటీలు పడి ధర పెంచి క్రికెట్ ప్లేయర్ లను కొనుగోలు చేసినట్లు వెంకన్న ఆర్జిత సేవా టికెట్ల ధరలపై ధర్మకర్తల మండలి, డిప్యూటేషన్ అధికారుల సంభాషణ ఉందని, ఈ విషయాలను తక్షణమే పరిశీలించాలని ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు.
టిటిడి బోర్డు సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసిన వెంకన్న భక్తులందరూ ఆవేదనతో ఉన్నారని, వీరా తిరుమల తిరుపతి ధర్మకర్తలు? అని ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. ధర్మకర్తలకి సలహాలు ఇస్తున్న అధికారులు అసలు బాధ్యతగల డిప్యూటేషన్ అధికారులేనా? అని కూడా తిరుపతి వెంకన్న భక్తులు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారని నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా టిక్కెట్ల అధిక ధరల విషయంలో మంత్రివర్గ కమిటీని వేసి ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటుంటే టీటీడీ ధర్మ ప్రభువుల సమావేశంలో సేవా టిక్కెట్ల ధరల వేలంపాట పాడినట్లు ఫిక్స్ చేస్తున్నారని ఇదేం ధర్మమని ఆయన ప్రశ్నించారు.
హిందూ సమాజాన్ని సీఎం గౌరవిస్తారని, టీటీడీ అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక క్షేత్రం అని వ్యాపార సంస్థ కాదని నిరూపిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. టిటిడి డిప్యూటేషన్ అధికారులు ధర్మకర్తల మండలి ఏకపక్ష నిర్ణయాలను నిలుపుదల చేస్తారని ఆశిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా చూసిన శ్రీవారి భక్తులందరూ కోరుకునేది ఒక్కటే శాశ్వతంగా ధర్మకర్తల మండలి లేకుండా రద్దు చేయండి. డిప్యుటేషన్ పై టిటీడీ కి వచ్చి నియంతలా వ్యవహరిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలను వ్యాపారంతో ముడిపెడుతూ ఆదాయమే పరమావధిగా శ్రీవారి ప్రసాదాలు,అద్దె గదులు, ఆర్జిత సేవల ధరలు పెంచుతూ యావత్ “హిందూ సమాజం” ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని “దోషి”గా నిలబెడుతున్న అధికారులను సాగనంపండి అని ఆయన కోరారు.