తన వద్ద విద్యాబుద్ధులు నేర్చిన శిష్యులు జీవితంలో స్థిరపడి వివిధ ఉద్యోగాలు చేయడమే కాకుండా, సామాజిక స్పృహ కలిగి నలుగురికి ఉపయోగపడుతుంటే ఆ గురువు ఎంతో సంతోషిస్తారు. ఈ సన్నివేశం ములుగు జిల్లా చల్వాయి ఉన్నత పాఠశాలలో జరిగింది.
గత జనవరి నెలలో పాఠశాలకు బదిలీపై వచ్చి గణిత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సుతారి మురళీధర్ తొలితరం శిష్యులు అమెరికాలో స్థిరపడి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇటీవలే తను పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థులు విద్యార్థులు నేలపై కూర్చొని అభ్యసనం చేస్తున్న విషయాన్ని ప్రస్తావించగా వారంతా వెంటనే స్పందించి 70 వేల రూపాయలు విలువగల డ్యూయల్ డెస్క్ బెంచీలను కొనుగోలు చేసి ఇచ్చారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తమ విద్యార్థులు చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుంటేనే ఉపాధ్యాయులు ఎంతో సంతోషిస్తారని, ఇలా పెద్ద ఉద్యోగాలు చేయడమేగాక, అడిగిన వెంటనే స్పందించి విద్యార్థులకు తమవంతు సహాయం అందించడం గొప్ప విషయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుంజ రాజేశ్వర్ రావు,ఉపాధ్యాయులు మొలుగూరి రమేష్,ఉప్పుతల ప్రసాద్,దామరాజు సమ్మయ్య, చల్లగురుగుల మల్లయ్య, బూత్కూరి శ్యామ్ సుందర్ రెడ్డి,శ్రీరాముల శ్రీనివాసరావు,భూక్య సరిత,ముడుంబ వెంకటరమణ మూర్తి,అందె రమాదేవి,పూసం శ్రీదేవి,రాయబారపు దీప్తి పాల్గొన్నారు.