మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు పట్టణానికి చెందిన వ్యాపారి చిదిరాల గీతా నవీన్ పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా నిర్మూలన కోసం వినియోగించడానికి వీలుగా రూ. లక్ష విరాళం ప్రకటించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఈ మేరకు చెక్ ను అందచేశారు.
అలాగే నిరుపేదలకు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల లోగోని కూడా మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు విజృంభిస్తున్నదని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కరోనా కష్ట కాలంలో అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారని, ప్రజలను ఆదుకుంటున్నారని చెప్పారు. ప్రజలు కంప్లీట్ లాక్ డౌన్ లో ఉన్నందున, దినసరి కూలీలు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించాల్సిన అసవరం ఉందన్నారు.
నవీన్ లాంటి వాళ్ళు విరాళం ఇవ్వడమే గాకుండా, నిరుపేదలకు నిత్యావసర సరుకులు ఇవ్వడానికి ముందు రావడాన్ని మంత్రి అభినందించారు. నలుగురికి సాయం అందించగలిగిన ఆర్థిక స్థోమత ఉన్నవాళ్ళు… ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.