ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేస్తానని ప్రకటించిన ఒక యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
అతడిని ఈశాన్య ఢిల్లీ లోనీ ఖజూరి ఖాస్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల సల్మాన్ ఎలియాస్ అర్మాన్ గా పోలీసులు గుర్తించారు.
ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేస్తానని అతను ఏకంగా పోలీసు కంట్రోల్ రూం కే ఫోన్ చేసి చెప్పాడని పోలీసు అధికారులు వెల్లడించారు.
దాంతో పోలీసులు అప్రమత్తం అయి అతడిని వెతికిపట్టుకుని అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలకు బానిస అయిన అర్మాన్ తాను జైలుకు వెళ్లేందుకే ఇలా ఫోన్ చేసినట్లు తెలిపాడు.
చిన్న తనంలోనే నేరం చేసి బాలల కారాగారంలో గడిపిన అర్మాన్ ఆ తర్వాత బయటకు వచ్చి కూడా నేరాలు చేస్తూనే ఉన్నాడు.
2018లో ఒక హత్య కేసులో అర్మాన్ జైలు శిక్ష కూడా అనుభవించాడు.
అతను ఫోన్ చేసిన నెంబర్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో గమనించి స్థానిక పోలీసులు అతడిని పట్టుకున్నారు.
అతడు చెబుతున్నది నిజమేనా లేక ఏదైనా కుట్ర ఉందా అనే అంశంలో నిఘా వర్గాలు కూడా అతడిని ప్రశ్నించనున్నాయి.