37.2 C
Hyderabad
May 2, 2024 14: 26 PM
Slider ఆధ్యాత్మికం

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామయ్య  క‌ల్యాణం

#ontimitta

వైఎస్ఆర్ జిల్లా  ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జ‌రిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి  క‌ల్యాణోత్స‌వాన్ని తన్మయత్వంతో  తిల‌కించారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని రాత్రి 7 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు.

రాత్రి 7.30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. 8 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్‌ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం చేసేందుకు పుణ్యాహవచనం నిర్వహించారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం), మధుపర్కార్చనం చేశారు.

మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. రాములవారి వంశస్వరూపాన్ని స్తుతించారు. అగ్నిప్రతిష్టాపన తరువాత సీతా రాముల తల మీద జీలకర్ర, బెల్లం ఉంచి శాస్త్రోకంగా కల్యాణ వేడుక నిర్వహించారు. తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి, మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేప‌ట్టారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్త‌యింది.

వైభవంగా శ్రీ సీతారాముల ఉత్సవర్ల శోభాయాత్ర

స్వామివారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర ఆలయం నుండి కల్యాణవేదిక వరకు వైభవంగా జరిగింది. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర వేడుకగా సాగింది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

భ‌క్తులంద‌రికి ముత్యంతో కూడిన త‌లంబ్రాల పంపిణీ

కల్యాణవేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చుని శ్రీ సీతారాముల క‌ల్యాణాన్ని తిలకించేందుకు విచ్చేసిన భ‌క్తులంద‌రికి శ్రీ‌వారి సేవ‌కులు ముత్యంతో కూడిన త‌లంబ్రాల‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, మంత్రులు కొట్టు సత్యనారాయణ, రోజా, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు ,ఈవో ఎవి ధర్మారెడ్డి దంపతులు,జేఈవో లు సదా భార్గవి, వీరబ్రహ్మం, జిల్లా పరిషత్ చైర్మన్  ఆకేపాటి అమరనాథ రెడ్డి, శాసన సభ్యులు మేడా మల్లిఖార్జున రెడ్డి, జి. శ్రీకాంత్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, వై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ  అన్బు రాజన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జన్ సహస్ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం

Satyam NEWS

హైవే ముట్టడికి అడ్డుకట్ట: డాక్టర్ చదలవాడ గృహనిర్బంధం

Satyam NEWS

పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత

Satyam NEWS

Leave a Comment