ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య కల్యాణం సందర్బంగా తిరుమల నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి బుధవారం కానుకలు పంపారు. శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ శుభ సందర్బంగా 360 గ్రాముల బరువు గల బంగారు పతకం, కౌస్తుభం ఆభరణాలను కానుకగా అందించారు.
టీటీడీ అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి కానుకలు పంపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం ఈ ఆభరణాలు సమర్పించారు. ఆలయం ముందు ఈవో ఎవి ధర్మారెడ్డి ఆభరణాలకు పూజలు చేసి కోదండరామునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఈవో లు సదా భార్గవి, వీరబ్రహ్మం ,ఆలయ డెప్యూటీ ఈవో నటేశ్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.