రామతీర్ధం కొండపై వున్న కోదండ రాముని విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలో నిందితుల్ని త్వరలోనే బయటపెడతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ ఘటన వెనుక ఉన్నవారి వివరాలను కూడా బయటపెడతామని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ప్రభుత్వం సి.సి. కెమెరాల ఏర్పాటు, భద్రత పటిష్టం చేయడం వంటి చర్యలు చేపడుతుందన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ తదితరులతో కలసి రామతీర్ధంలో బోడికొండపై వున్న కోదండరాముని ఆలయాన్ని మంత్రి కాలినడకన కొండపైకి వెళ్లి దర్శించారు.
ఆలయం దిగువన ఉన్న గుంటలో విగ్రహం పడవేసిన ప్రదేశాన్ని పరిశీలించి ఘటన ఏవిధంగా జరిగిందనే విషయాన్ని ఎస్.పి. రాజకుమారి ద్వారా తెలుసుకున్నారు. కొండపై వున్న ఆలయ పూజారులతో మాట్లాడి రాముల వారికి నిర్వహిస్తున్న పూజలు, కొండపై జరుగుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు.
రామతీర్ధ ఆలయంలో మంత్రుల పూజలు
ప్రతిరోజూ స్వామి వారికి నైవేద్యం సమర్పించిన తర్వాత గుడి తలుపులు మూసివేస్తామని, భక్తులంతా బయట నుండే దర్శనం చేసుకుంటారని పూజారులు వివరించారు. అనంతరం మంత్రులు మెట్ల మార్గంలో చెప్పులు ధరించకుండానే కొండపై నుంచి కాలినడకన కిందకు దిగారు.
రామతీర్ధంలోని రామస్వామి వారి ఆలయాన్ని దర్శించి పూజలు చేశారు. ఇ.ఓ. కార్యాలయంలో రాజధాని నుంచి వచ్చిన దేవాదాయశాఖ కమిషనర్ పి.అర్జునరావు, అదనపు కమిషనర్ రామచంద్రమోహన్, ప్రాంతీయ కమిషనర్ భ్రమరాంబ, డిప్యూటీ కమిషనర్ సుజాత తదితరులతో విగ్రహాల పునః ప్రతిష్ట, ఆలయ సంప్రోక్షణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం రామతీర్ధంలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ రామతీర్ధం ఘటనలో నిందితులను పట్టుకోవడం, ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్ట, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయమై దృష్టి సారించామన్నారు.
ఆగమ పండితులతో చర్చించి తదుపరి కార్యక్రమం
కొందరు ఆగమ పండితులతో కమిటీ వేసి వారి ప్రతిపాదనలు, సూచనల మేరకు తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని, తప్పుచేసిన వారెవరినీ ఉపేక్షించేది లేదన్నారు. రామాయణంలో రాముడు ఎలా దుష్టశిక్షణ చేశారో ఇక్కడ కూడా ఈ ఘటనకు పాల్పడిన వారికి, దానివెనుక వున్నవారికి దుష్టశిక్షణ తప్పదని స్పష్టంచేశారు.
ఈ ప్రాంతవాసిగా, ప్రభుత్వంలో మంత్రిగా ఈ ఘటన పట్ల ఎంతో బాధపడుతున్నానని మంత్రి పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిదీ, అందుకు ప్రేరేపించిన వారిదీ మానవ జన్మయేనా అనే అనుమానం కలుగుతోందన్నారు. విజయనగరం ఎంతో శాంతికాముకమైన జిల్లా అని ఇటువంటి జిల్లాలో విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలకు ప్రోత్సహించడం దురదృష్టకరమన్నారు.
సీఎం గా చిన్న వయస్సులోనే సీఎం జగన్ లక్షలాది మందికి ఇళ్లపట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు.మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొండపై జరిగిన ఘటన ఎంతో బాధాకరమని అన్నారు.
రామతీర్ధం విశిష్టతను పెంచుతాం
దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించి ఆగమశాస్త్రం ప్రకారం ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. హిందూ మతపెద్దలు, ఆగమ పండితుల సలహాలతో రామతీర్ధం దేవాలయానికి వున్న ప్రతిష్టను, విశిష్టతను పెంపొందించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
దేవాలయం కొండపై ఏకాంత ప్రదేశంలో వున్న కారణంగా కొందరు దుండగులు రాత్రిపూట దొడ్డిదారిన వచ్చి విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారని చెప్పారు. దేవాలయాల పట్ల అందరికీ బాధ్యత వుంటుందన్నారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుగుతుందని దోషులను పట్టుకొని తీరతామని స్పష్టంచేశారు.
ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎం.ఎల్.సి. పెనుమత్స సురేష్ బాబు, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య, జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ పాల్గొన్నారు.
ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్, విజయనగరం