సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో పివి స్మారకోపన్యాసం-2019 హైదరాబాద్ దసపల్లా హోటల్ వేదికగా ఘనంగా జరిగింది. ప్రఖ్యాత రాజనీతిశాస్త్ర ఆచార్యులు, పూర్వఉపకులపతి RVR చంద్రశేఖరరావు పివిపై స్మారకోపన్యాసం చేశారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కంటే కూడా పివి గొప్పపండితుడని కొనియాడారు.
పివి చారిత్రక పరిఙ్ఞత, రాజనీతిజ్ఞత, చతురత, వ్యవహారదక్షత,సాహిత్యానురక్తి, భావప్రకటనాశక్తి, దేశభక్తి, దార్శనికత అనుపమానమని ప్రశంసించారు. పివి నరసింహారావు అద్భుతంగా పద్యాలు చదివేవారని, పోతన భాగవతంలోని గజేంద్రమోక్షం పద్యాలు చదివి, వివరిస్తుంటే ఆ ప్రతిభకు ఆశ్చర్య పోయానని చంద్రశేఖరరావు అన్నారు.
మరో 100 ఏళ్ళ వరకూ ఇటు వంటి వారు పుట్టరని ఆయన అన్నారు. పివితో తనకున్న అనుబంధాన్ని RVR చంద్రశేఖరరావు గుర్తు చేసుకున్నారు. పివి ప్రధాన మంత్రిగా ఎంపికైనందుకు ఎన్టీఆర్ ఎంతో సంతోషించారని, ఆ సందర్భంలో తాను ఎన్టీఆర్ దగ్గరే ఉన్నానని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తెలిపారు.
భారతదేశ పునర్నిర్మాణంలో పివినరసింహారావు పాత్ర చాలా గొప్పదని చలమేశ్వర్ కొనియాడారు. పివికి రావలసినంత గుర్తింపు రాలేదని, సొంత పార్టీవారే సోనియాగాంధీకి భయపడి, పివిని విస్మరించారని ‘పివి స్మారక’ నిర్వాహకుడు సీనియర్ జర్నలిస్ట్ కె. రామచంద్రమూర్తి వ్యాఖ్యానించారు. మరణించిన 8 ఏళ్ళ వరకూ కూడా పివిని ఎవ్వరూ పట్టించుకోలేదని అన్నారు.
ఈ నేపథ్యంలో తెలుగువాడిగా, భారతీయ ప్రతిభామూర్తిగా, గొప్ప ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ఎప్పటికీ మన స్మృతి పథంలో నిలవాలనే ఉద్దేశ్యంతో 7ఏళ్ళ క్రితం “పివి స్మారక ఉపన్యాస వేదిక” ప్రారంభించానని రామచంద్రమూర్తి తెలిపారు. అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి హోదాలో వచ్చి, పివిపై ప్రారంభ స్మారక ఉపన్యాసం చేశారని వివరించారు.
గులాంనబీ ఆజాద్, రాజ్ మోహన్ గాంధీ, జైరాం రమేష్, జస్టిస్ వెంకటాచలయ్య, సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా ఇదే వేదికపై ఇప్పటివరకూ పివి స్మారక ఉపన్యాసాలు అందించారని రామచంద్రమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్ట్ మాశర్మ సహాయకారిగా వ్యవహరించాడు. పివి మనుమడు NV సుభాష్ ఆహుతులకు ధన్యవాదాలు తెలిపారు. అపర చాణక్యుడుగా పేరు పొందిన పి వి కి భారత రత్న ఇవ్వాలని ఆయన కోరారు.
ముందుగా పివి చిత్రపటానికి పూలమాల, పుష్పాభిషేకంతో నివాళులర్పించారు. తెలంగాణా ట్రాన్స్ కో CMD దేవులపల్లి ప్రభాకరరావు, పివి కుమారుడు ప్రభాకరరావు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధానకార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, విద్యావేత్త చుక్కా రామయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారుడు దేవులపల్లి అమర్ పాల్గొన్నారు.
ఇంకా పివి Insider తెలుగు అనువాదం ‘లోపలి మనిషి’ రచయిత కల్లూరి భాస్కరం, సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్, BBC తెలుగు, ఢిల్లీ ప్రతినిధి పసునూరి శ్రీధర్ బాబు, మల్లేపల్లి లక్ష్మయ్య, ఎమెస్కో అధినేత విజయకుమార్ కూడా హాజరయ్యారు.