అత్యాచార నిందితులకు శిక్ష విధించే విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం సంచల నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఊహించని రీతిలో కఠిన శిక్షను అమల్లోకి తీసుకువచ్చింది. అత్యాచారానికి పాల్పడిన నిందితులకు కెమికల్ కాస్ట్రేషన్ పనిష్మెంట్ (లైంగికంగా పనికిరాకుండా చేయడం) ఇవ్వనుంది.
నేరారోపణలను వేగంగా తేల్చడానికి, కఠిన శిక్షలను విధించడానికి ఉద్దేశించిన కొత్త చట్టాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదించింది. ఇటీవలి కాలంలో స్త్రీలు, చిన్నారులపై అత్యాచార ఘటనలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. అత్యాచారాలను అరికట్టాలనే, కఠిన శిక్షలు వేయాలనే డిమాండ్లు ప్రజల నుంచి వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం.. ఈ కఠిన చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తులకు కెమెకల్ కాస్ట్రేషన్ చేస్తారు. అలాగే, ఈ కేసుల్లో త్వరితగతిన విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ను ఏడాది క్రితమే తీసుకురాగా.. ఇప్పుడు పార్లమెంట్ ఆమోదం లభించింది.