పాలేరుకు బస్టాండ్ కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గడప గడపకూ కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పొంగులేటి ప్రసాద్ రెడ్డి గ్రామంలోని ప్రతి గడపకూ తిరుగుతూ హస్తం పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలను గురించి వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్నేళ్ల నుంచి నియోజకవర్గానికి బస్టాండ్ ఏర్పాటు చేయాలని పాలేరు ప్రజలు కోరుతున్నా ఇప్పుడున్న అధికార బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. వారి కోరికను తీర్చేందుకు రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశు ద్ధితో ఉందన్నారు. ప్రజల ఆశీస్సులు… దీవెనలతో అధికారంలోకి రానున్న హస్తం పార్టీతోనే వారి కలనెరవేరుతుందని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన ఆనతి కాలంలోనే బస్టాండ్ ఏర్పాటుకు శంఖుస్థాపన తమ ప్రభుత్వం చేపడుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెల్లూరి భద్రయ్య, కొడాలి గోవిందరావు, శ్రీనివాస రెడ్డి, చెర్వు స్వర్ణ, మీసా నాగేశ్వరరావు, కట్టెకోల నాగేశ్వరరావు, మామిడి వెంకన్న, ఎస్.కె. మదార్ తదితరులు ఉన్నారు.