గ్రామాల అభివృద్ధి కోసమే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారరంభించారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద దోమకొండ మండలానికి సంబందించిన ఐదు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం విజయవంతంగా కొనసాగడంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి బాటలు వేసిందన్నారు.
దానికి కొనసాగింపుగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. పల్లె ప్రగతిలో గ్రామాల్లో సకల వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. 70 సంవత్సరాల పాలనలో ఏ గ్రామంలో కూడా వైకుంఠ ధామాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఏ ముఖ్యమంత్రి చేయలేదని చెప్పారు.
భూముల ధరలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో అంత్యక్రియలు నిర్వహించడానికి సైతం స్థలం లేని పరిస్థితి రావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించి వైకుంఠ ధామాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను డంపింగ్ యార్డులో వేయడం జరుగుతుందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుధ్యం మెరుగుపడిందని అన్నారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.