భార్యల్ని ఎదురుగా పెట్టి వెనుక నుంచి అధికారం చెలాయించాలనుకుంటున్న వారికి చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భార్య నిర్వహించాల్సిన సమావేశాల్లో పాల్గొనే భర్తల్ని అదుపు చేసేందుకు కఠిన నియమనిబంధనలు జారీ చేసింది.
అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలలో, కార్యక్రమాలలో పాల్గొనడానికి వీలు లేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని హచ్చరించింది.
ఈ మేరకు పంచాయతీ రాజ్ కమీషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ యొక్క అధికారిక సమావేశాలలో ప్రజా ప్రతినిధుల భార్య/భర్తలు, కుటుంబ సభ్యులు, చుట్టాలు పాల్గొంటున్నారని, అంతేగాక పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారని పలు ప్రాంతాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యాలయం కమీషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.
దీనికి స్పందించిన పంచాయతీ రాజ్ కమీషనర్ జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
తాజా ఆదేశాల ప్రకారం ప్రజా ప్రతినిధుల (వార్డ్ సభ్యులు, సర్పంచ్, MPTC, ZPTC, MPP, ZPP) కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలలో, కార్యక్రమాలలో పాల్గొనడానికి వీలు లేదు. పాల్గొంటున్నారని తెలిస్తే, సంబంధిత పంచాయతీ సెక్రటరీ, MPO, MPDO, DPO, ZP CEO లపై కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని, అలాగే రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం 2018 – సెక్షన్ 37(5) ప్రకారం (women) ప్రజా ప్రతినిధుల భర్త / కుటుంబ సభ్యులు / చుట్టాలపై క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని ప్రభుత్వం తెలిపింది.
ఇలాంటి సమస్యలు ప్రజలు చూస్తే పంచాయతీ రాజ్ కమీషనర్ లేదా కలెక్టర్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లవచ్చునని కూడా ఆదేశాలు వెలువడ్డాయి.