రాష్ట్ర అసెంబ్లీలు, లోక్ సభ కు జమిలి ఎన్నికలు నిర్వహించడమే అన్ని విధాలా శ్రేయస్కరమని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.
న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ మేరకు పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో వివిధ రకాల ఎన్నికలు నిరంతరంగా జరుగుతుండటం వల్ల ఓటర్లలో కూడా నిరాశక్తత పెరిగిపోతున్నదని కమిటీ అభిప్రాయపడింది.
జమిలి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎంతో ఖర్చును ఆదాచేయడమే కాకుండా మానవ వనరులను కూడా అతి తక్కువగా వినియోగించుకోవచ్చునని కమిటీ చెప్పింది.
జమిలి ఎన్నికల నిర్వహణ వివిధ రాజకీయ పార్టీలపై కూడా ఆర్ధిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని వారు తెలిపారు.
ఒకే దేశం ఒకే సారి ఎన్నికలు అనేది మన దేశానికి కొత్త విధానం కూడా కాదని కమిటి తెలిపింది. దేశానికి స్వాంతంత్ర్యం వచ్చిన తర్వాత మూడు పర్యాయాలు దేశం మొత్తం ఒకే సారి ఎన్నికలు జరిగాయని వారు గుర్తు చేశారు.
1952, 1957, 1962 ఎన్నికలు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు అన్ని లోక్ సభ స్థానాలకు ఒకే సారి జరిగిన విషయాన్ని స్టాండింగ్ కమిటి గుర్తు చేసింది. జమిలి ఎన్నికలకు అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్య చట్టాలను సవరించాలని కమిటీ సిఫార్సు చేసింది.