జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతం మందడంలో పర్యటిస్తున్నారు. రాజధాని తరలింపుపై ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నామని పవన్ తెలిపారు.
రాయలసీమలో టమోటో రైతులకు ఎలా అయితే అండగా నిలిచామో అదే విధంగా రాజధాని ప్రాంత రైతులకు కూడా అంతే అండగా ఉంటామన్నారు. రైతుల్ని పోలీసులు ఇబ్బందులు పెట్టొచ్చు.. కేసులు పెడతామని బెదిరించొచ్చు.. కానీ రైతులు ఎవరికీ భయపడ వద్దని ఆయన భరోసా కల్పించారు.
రైతులు ప్రభుత్వానికి భూములిచ్చారని, ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేశారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవలని పవన్ చెప్పారు. రాజధానికి కట్టుబడి ఉంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట ఇచ్చిందని, రాజ్యాంగానికి కట్టుబడే ప్రతి ఒక్కరూ పని చేయాలని పవన్ సూచించారు.
రాజధాని మారుస్తామని జగన్ రెడ్డి ఎన్నికలకు ముందే చెప్పిఉంటే అందరం ఒప్పుకునేవారమని ఆయన అన్నారు. అమరావతిలో రాజధాని ఇష్టం లేకపోతే 2014లోనే జగన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పి ఉండాల్సింది. అప్పుడే జగన్ అసెంబ్లీలో చెప్పి ఉంటే రైతులు భూసమీకరణకు ఒప్పుకొని ఉండేవాళ్లు కాదేమోనని పవన్ అన్నారు.