కరోనా వైద్యం చేయించుకుంటూనే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసుపత్రి నుంచి వీడియో సందేశం పంపారు. తన ఆరోగ్యం గురించి భగవంతుడిని ప్రార్థించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా దీవెనలతో రెండు మూడు రోజులలో ఇంటికి డిశ్చార్జి అవుతానని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు కరోనా బాధితుల కోసం గాంధీ భవన్ తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సేవలు చేస్తున్నారని, వారందరినీ అభినందిస్తూ గర్వపడుతున్నానని అన్నారు.
కరోనా ను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని,పేద ప్రజలు కరోనా బారిన పడితే వారికి వైద్య సేవలు అందక నానా కష్టాలు పడుతున్నారని, ఇది అత్యంత బాధాకరమైన విషయమని,హాస్పిటల్స్ లో బెడ్స్ దొరకక,ఆక్సిజన్ లేక, వెంటిలేటర్స్ లేక, మందులు, రేమిడిసివర్ ఇంజెక్షన్ దొరకక రోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతమని ఆయన అన్నారు.
ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం కనీస బాధ్యతని, ఈ విషయంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం కావడం దురదృష్టకరమని అన్నారు. కరోనా ను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని అన్నారు.