42.2 C
Hyderabad
April 26, 2024 16: 48 PM
Slider జాతీయం

కరోనా వైరస్ కన్నా ప్రమాదకరంగా మారిన పెగాసస్

#Pegasus

పెగాసస్ రేపుతున్న సెగ అంతాఇంతా కాదు. ఎదుటివారిని గుప్పెట్లో పెట్టుకోడానికి,ప్రత్యర్థులను నిర్వీర్యం చేయడానికి,వారి ప్రతి కదలిక తెలుసుకోడానికి,చుట్టూ ఏదో జరుగుతోందనే భయాన్ని కలిగించడానికి,వ్యూహప్రతి వ్యూహాలను రచించుకోడానికి, నిత్యం అభద్రతాభావంలో ముంచడానికి అన్నట్లుగా సాగుతున్న ఈ నిఘాచర్యలు  జాతికే సిగ్గుచేటు.దాని విస్తృతి వింటుంటే? దేశమంతా భయపడుతోంది,లోకమంతా వణుకుతోంది.

ఎవరు తీసిన గొయ్యిలో వారే పడతారు అన్న చందంగా,ఈ అక్రమాలకు పాల్పడేవారికి కూడా ఏదో రోజు ముప్పు తప్పదు. కరోనా వైరస్ ను మించిన కలవరం సృష్టిస్తున్న పెగాసస్ స్పైవేర్ నిగ్గు తేల్చాల్సిందే. రాజకీయ నాయకులు, అధికారులు,వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు,మేధావులు, మీడియా వ్యక్తులతోనే ఇది ఆగేట్టు కనిపించడం లేదు.

సామాన్యుడు కూడా భయపడే పరిస్థితి

సామాన్యుడు కూడా దీని గురించి భయపడే వాతావరణం అలుముకుంటోంది.దీని ద్వారా ఆర్ధికపరమైన సమాచారం కూడా సేకరించి,తస్కరించే పరిస్థితి ఉందంటున్నారు.పడక గది నుంచి పాలన వరకూ సర్వ రహస్యాలను బట్టబయలు చేసే దీని విషయంలో తాడోపేడో తేల్చాల్సిందే.

మన దేశానికి చెందిన ఎందరో ప్రముఖులు,ముఖ్యుల జాతకాలాన్నీ ఇప్పటికే సేకరించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపై కిమ్మంటోంది. ఇజ్రాయల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు కూడా చెప్పడం లేదు.ఈ స్పైవేర్ ను వాడుతున్నట్లు వెల్లడించడం లేదు.

ఈ పెగాసస్ ఇప్పటికిప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది కాదు.చాన్నళ్ల నుంచే ఈ కథ నడుస్తున్నట్లు కథనాలు వచ్చాయి.పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (ఐటీ) ఈ నెల 28 వ తేదిన ఈ అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. స్టాండింగ్ కమిటీ ముందుకు రావడం కూడా ఇదే మొట్టమొదటిసారి కాదు. 2019లో కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది.

‘పెద్దల’ కనుసన్నల్లోనే నిఘా

విపక్షాలు విమర్శిస్తున్నట్లుగా ప్రభుత్వ పెద్దలకు ఆన్నీ తెలిసి,వారి కనుసన్నల్లోనే నిఘాతంతు నడుస్తోందని వినపడుతున్న వేళ,నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై,పాలకులపై ఉంది. ఇదంతా నిజమేననే అనుమానాలు ప్రబలుతున్న వేళ,పౌర స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ప్రశ్నార్ధకమవుతున్నాయి.

దేశ రక్షణ అభద్రతలోకి వెళ్తోంది. ఉగ్రవాదులు,తీవ్రవాదులు, తీవ్ర నేరస్తులపై నిఘా కోసం వినియోగించుకోవాల్సిన ఇటువంటి వ్యవస్థలను ఇంత విశృంఖలంగా ప్రతివ్యక్తిపైనా, ప్రతి వ్యవస్థ ప్రతినిధిపైనా వాడుతున్నారనే అంశం సామాన్యమైంది కాదు.

రాజ్యాంగం కల్పించిన హక్కులు కాగితాలకు, ఉపన్యాసాలకు పరిమితమవుతున్న తరుణంలో,సర్వోన్నత న్యాయస్థానం దీనిపై దృష్టి సారించాలి.సుమోటాగా స్వీకరించాలి.పెగాసస్ నిఘా విష కౌగిలిలో కొందరు న్యాయమూర్తుల సమాచారం కూడా చిక్కుకొని ఉందంటున్న  దుర్దశలో,పాలకుల ఇచ్చకు వచ్చినట్లుగా విధానాలను రూపకల్పనచేసే తీరుకు సంకెళ్లు వేయాలి.డేటా పరిరక్షణ బిల్లును సకల ప్రజాహితంగా,సర్వరక్షక  కవచంగా సంస్కరించాలి.’డేటా పరిరక్షణ అధారిటీ’ స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యంగ వ్యవస్థగా అవతరించాలి.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా టీ.శ్రీనివాసరావు

Satyam NEWS

మాన్సాస్ చైర్మ‌న్ ఆదేశాల‌నుపాటించాల్సిందే: హైకోర్టు

Satyam NEWS

ఆపరేషన్ వికటించి ఒక మహిళ మృతి

Satyam NEWS

Leave a Comment