రాజధాని వికేంద్రీకరణకు ఉద్దేశించిన బిల్లులు ఆమోదం పొందకుండా అమరావతి నుంచి రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టేది లేదని అడ్వకేట్ జనరల్ రాష్ట్ర హైకోర్టుకు స్పష్టం చేశారు. రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి తరపున కార్యదర్శి గద్దె తిరుపతి రావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
రాజధాని తరలింపుపై జేఏసీ వేసిన పిల్ పై హైకోర్టులో నేడు వాదనలు జరిగాయి. రాజధాని వికేంద్రీకరణకు ఉద్దేశించిన బిల్లులు ఆమోదం పొందకుండా అమరావతి నుంచి రాజధాని తరలించేది లేదని అడ్వకేట్ జనరల్ చెప్పడంతో ఇదే విషయంతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఏజీకి హైకోర్టు ఆదేశం ఇచ్చింది.
ప్రమాణపత్రం దాఖలుకు 10 రోజుల సమయం కావాలని ఏజీ కోరగా హైకోర్టు గడువును ఇచ్చింది. రాజధాని తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఈలోపు రాజధాని తరలింపుపై ఎలాంటి చర్యలు తీసుకున్నా ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లను హైకోర్టు సూచించింది. రాజధాని తరలింపును ఆపడం ఎవరి తరమూ కాదని వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని ఏజీ ని హైకోర్టు కోరింది.