ఉపాధి హామీ పథకం బకాయిలను తక్షణమే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసినట్లు పంచాయితీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
మొత్తం రూ.2500 కోట్ల మేరకు సంబంధిత సర్పంచ్ లకు, కూలీలకు వెంటనే చెల్లించాలని ఆయన దాఖలు చేసిన పిల్ లో కోరారు. ఏప్రిల్ 20న కేంద్ర ప్రభుత్వం ఈ పద్దు కింద రాష్ట్రానికి రూ.1900 కోట్లు విడుదలయ్యాయని ఆయన అన్నారు. ఈ నిధులతో బకాయిలు చెల్లించమని కేంద్రం ప్రభుత్వం స్పష్టం గా ఆదేశాలు ఇచ్చిందని అయినా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వం ఆదేశాలు ధిక్కరించి పాత బకాయిలు చెల్లించకుండా ఉందని ఆయన అన్నారు.
2019 సంవత్సరపు బిల్లులు చెల్లించకుండా ఆ తర్వాతి సంవత్సరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తున్నదని ఆయన అన్నారు. కేంద్రం విడుదల చేసిన ఆ 1900 కోట్ల రూపాయలను పాత బకాయిలకే చెల్లించాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హై కోర్ట్ దృష్టికి తీసుకువెళ్తూ కేస్ వేశామని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
2018-2019 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన సర్పంచ్ లు, కూలీలు బిల్లులు రాక అప్పుల పాలై, ఇబ్బందులు పడుతూ ఆత్మహత్య లు చేసుకొనే పరిస్థితికి వస్తున్నారని రాజేంద్రప్రసాద్ అన్నారు.