ఖమ్మం జిల్లాలో నిర్మితమవుతున్న జాతీయ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం గురించి బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు న్యూఢిల్లీలో కేంద్ర జాతీయ రహదారులు, హైవేస్ అభివృద్ధి శాఖా మంత్రి నితిన్ జయరామ్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్ఫోల్డ్ రహదారికి సంబంధించి వలు అంశాల పై కూలంకషంగా సుదీర్ఘంగా చర్చించి, నితిన్ గడ్కరీకి వివరించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజల ఆకాంక్షలు, సూచనలను పరిగణలోకి తీసుకుని, ఖమ్మం సమీకృత కలెక్టేట్ సముదాయం వద్ద నిర్మితమవుతున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి అలైన్మెంట్ ను మార్చాలని, ఈ రహదారిని ఖమ్మం నగరానికి 5 కిలో మీటర్లు దూరంలో నిర్మించాలని నామ నితిన్ గడ్కరీని ఈ సందర్భంగా కోరారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధి ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు, బల్లేపల్లి, ఖమ్మం రూరల్ మండలం తీర్థాల, కామంచికల్లు, దారేడు, రేగుల చలక, రఘునాథపాలెం, వి.వెంకటాయపాలెం మీదుగా నిర్మిస్తున్న ఈ జాతీయ రహదారి ఖమ్మం సమీకృత కలెక్టరేట్ దగ్గరగా వెళతుందని, దీనిని 5 కిలో మీటర్ల దూరంలో నిర్మించడం వల్ల ఈర్లపూడి, మంగళగూడెం, కోటపాడు, తీర్థాల వంటి చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఖమ్మం నగరం ఎంతో అభివృద్ధిని సాధిస్తాయని నామ కేంద్ర మంత్రికి వివరించారు.
గ్రీన్ ఫీల్డ్ రహదారి అలైన్మెంట్ను మార్పు చేసి, సమీకృత కలెక్టరేట్ నుంచి 5 కిలో మీటర్ల దూరం నుంచి నిర్మించడం వల్ల ఈనాడు కార్యాలయం – రఘనాథపాలెం రోడ్డును కూడా జాతీయ రహదారిగా మార్చడానికి అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా కోదాడ – – కొరవి రహదారిని కూడా జాతీయ రహదారిగా మార్పు చేయడానికి సులభతరం అవుతుందని నామ వివరించారు. అంతేకాకుండా భూసేకరణ వ్యయం కూడా బాగా తగ్గుతుందని నామ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని, గ్రీన్ ఫీల్డ్ రహదారి అలైన్మెంట్ మార్చాలని కోరుతున్నామని నామ కేంద్ర మంత్రికి వివరించారు. దీనిని స్పెషల్ కేసుగా పరిగణించి, గ్రీన్ ఫీల్డ్ రహదారి అలైన్మెంట్ మార్పు చేసేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని నామ నితిన్ గడ్కరీని కోరారు.