వర కట్నం వేధింపుల కారణంగా జరిగిన మరణాన్ని కూడా కోవిడ్ మరణంగా చూపవచ్చా? అతి తెలివి చూపిన ఒకడు ఇదే పని చేశాడు. పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు లో ఈ సంఘటన జరిగింది.
చనిపోయిన ఆమె తల్లిదండ్రులు వచ్చి అసలు విషయం తెలుసుకునే వరకూ దీన్ని అందరూ కోవిడ్ మరణమనే అనుకున్నారు.
వివరాలలోకి వెళితే కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన చిప్పల రాధాకృష్ణ నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
వీరిలో పెద్ద కుమార్తె ఝాన్సీ(20) ని ఏలూరు లోని ద్వారకా నగర్ కు చెందిన వాడపల్లి వీర వెంకటేసు కుఇచ్చి 2018 మే నెల 5 వ తేదీన వివాహం చేశారు.
వివాహ సమయంలో వెంకటేసుకు 60 సెంట్లు భూమి 6 లక్షల రూపాయల కట్నం ఇచ్చారు. వెంకటేసు, ఝాన్సీలకు ఒక బాబు కూడా పుట్టాడు.
అయితే అదనపు కట్నం కోసం వెంకటేసు ఝాన్సీని వేధించడం ఆపలేదు.
బుధవారం రాత్రి తమ కుమార్తెను చంపేసి కోవిడ్ సోకి మృతి చెందిందని తమకు చెప్పాడని ఝాన్సీ తల్లిదండ్రులు వాపోతున్నారు.
తమ కుమార్తెను కొట్టి చంపారని మృతదేహం చూసి గుర్తు పట్టిన ఇద్దరు అంబులెన్సు డ్రైవర్లు శవాన్ని తరలించేందుకు నిరాకరించారని వారు తెలిపారు.
ఎక్కువ డబ్బులు ఎర చూపి మూడో అంబులెన్సు డ్రైవర్ ను అతను కుదుర్చుకున్నాడని వారు వివరించారు.
చికిత్స చేయాలనే నెపంతో మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశాడని వారు వెల్లడించారు.
అక్కడ వారు చూడగానే ఆమె చనిపోయిందని నిర్ధారించి పోస్టు మార్టంకు పంపారని వారన్నారు.
వెంకటేసు, అతని తండ్రి తన పామాయిల్ తోటకు నీరు పెట్టేందుకు వెళ్లిన సమయంలో ఝాన్సి ఆత్మహత్య చేసుకున్నట్లు వెంకటేసు చెబుతున్నాడని ఏలూరు రూరల్ ఎస్ ఐ చావా సురేష్ తెలిపారు.
తాము కేసు నమోదు చేసుకుని విచారణ జరిపామని, దంపతుల మధ్య తరచూ తగాదాలు జరిగేవనే విషయం ప్రాధమిక దర్యాప్తులో తేలిందని ఆయన తెలిపారు.
తదుపరి వివరాల కోసం కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ తెలిపారు. ఝాన్సి వెంకటేసులకు ఒక కుమారుడు ఉన్నాడు.