కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ పి డాక్టర్ వై. సాయి శేఖర్ హెచ్చరించారు.
రోజు రోజుకి రాష్ట్రంలో కరోనా వ్యాధి విస్తరిస్తుండంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వ తారీఖు వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది.
ఈ లాక్ డౌన్ ఉత్తర్వుల అమలుపై ఏస్పీ డాక్టర్ వై. సాయి శేఖర్ ఓ ప్రకటన చేస్తూ ఈ కరోనా వ్యాధిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ నెం 45,46 లు జారీచేసిందని, ఈ ఉత్తర్వులను అనసరించి ప్రజా రవాణా వాహనాలైన ఆర్టీసీ, ప్రయివేట్ బస్సులు, టాక్సీలు, ఆటోరి క్షా లాంటి వాహనాల రాకపోకలను పూర్తి నిషేధించామని చెప్పారు.
అదే విధంగా నిత్యావసర వస్తువులను తరలించే వాహనాలకు ఈ నిబంధన వర్తించదని ఆయన తెలిపారు. అదే విధంగా మెడికల్, కిరాణం, పండ్లు కూరగాయలు, పాలకేంద్రాలు తప్ప మిగిలిన అన్నిరకాల వ్యాపార సంస్థలు, వ్యాపార సముదాలు, మల్టీప్లెక్సులు విధిగా మూసివేయాల ఎస్పీ తెలిపారు.
ముఖ్యంగా ఈ నెల 31వ తారీఖు వరకు సాయంత్రం 7 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలులో వుంటుందని, ఈ సమయంలో ప్రజలు రోడ్లపైకి రావడం నిషేధించామని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని ఎస్పీ సూచించారు.
నిత్యావసర వస్తువుల, అవసరాల కోసం బైకుపై ఒకరు మాత్రమే ప్రయాణించాలని, కారులో అయితే ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని సూచించారు. మూడు కిలోమీటర్ల పరిధిలోనే వాహనాలను వినియోగించుకోవాలని సూచించారు. నిత్యావసర, ఆరోగ్యానికి సంబంధించి నటువంటి విషయాలలో కాకుండా ఏ కారణం లేకుండా తిరిగే వాహనాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎవరైనా విదేశాల నుండి వస్తే 14 రోజులు సొంతంగా గానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యారంటైన్ కేంద్రాలలో గానీ ఐసోలేషన్ లో ఉండాలని ఎస్పీ తెలిపారు. హోం క్యారంటైన్ వున్న వ్యక్తులపై పోలీస్ నిఘా వుంటుందని ఆయన తెలిపారు. కరోనా వ్యాధికి సంబంధించి వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలో ప్రజలకు తప్పుదారి పట్టిస్తూ తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.