వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆంధ్ర ప్రదేశ్ డిఎస్సి కాంట్రాక్ట్ పారామెడికల్ ఎంప్లాయిస్ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కన్వీనర్ విజయవర్ధన్ బాబు బట్టు గురువారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ మేరకు ప్రతినిధి బృందం గురువారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన పశ్చిమగోదావరి జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ బి బాను నాయ.క్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో విజయవర్ధన్ బాబు బట్టు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతి ద్వారా డీఎస్సీ రాత పరీక్ష రూల్ ఆఫ్ రిజర్వేషన్, సాంక్షన్ పోస్టుల్లో నియామకం కాబడి నేటి వరకు క్రమబద్దీకరణకు నోచుకోక వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్హత సర్వీసు కలిగిన ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే క్రమబద్ధీకరిస్తామని చెప్పారని వారు గుర్తు చేశారు. వైసిపి మేనిఫెస్టో లో కూడా ఈ విషయం పొందుపరిచారని ఆయన తెలిపారు.
గత 39 రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ డీఎస్సీ కాంట్రాక్ట్ పారామెడికల్ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోయారు.
ఇటీవల కాలంలో కడప జిల్లాలో రమణయ్య అనే కాంట్రాక్ట్ ఉద్యోగి రిటైర్డ్ అయి విశ్రాంత ఉద్యోగిగా మాత్రమే మిగిలిపోయారని ప్రభుత్వం నుంచి రావలసిన ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉందని కుటుంబాన్ని ఆదుకోవాలని, కోవిడ్19 కారణంగా మృతి చెందిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కుటుంబాలకు జీవో ఆర్టి నెంబర్ 299 సవరించి రెగ్యులర్ ఉద్యోగులు మాదిరిగానే ఎక్స్గ్రేషియా సదుపాయాన్ని పునరుద్ధరించాలని మరణించిన కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగం ఇవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కె ఎన్ వి రామకృష్ణ, దారం సభాపతి చంద్రశేఖర్ బట్టు, అజయ్ ఎం యన్ ఓ, ఆర్ సింగరాజు మరదాని కిరణ్, నున్న గురునాథం ,వేండ్ర శ్రీనివాసరావు ఒగ్గు నెహ్రూ తదితరులు ఉన్నారు.