భారతదేశాన్ని, భారతదేశ రైతులను కాపాడుకుందాం, భారతీయులందరూ ఐక్యంగా పోరాటంలో పాల్గొని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన మోడీ 3 వ్యవసాయ చట్టాలను, నాలుగు లేబర్ కోడ్ లుగా తెచ్చిన నూతన కార్మిక చట్టాలు తక్షణమే రద్దు చేయాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సి ఐ టి యు అనుబంధ వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారత దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రైతులు చేపట్టిన దీక్షకు మద్దతుగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎలక సోమయ్య గౌడ్, సి ఐ టి యు అనుబంధ సంఘాల బజార్ హామాలీల సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం,
మున్సిపల్ వర్కర్స్ యూనియన్, రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు మసింగి శ్రీను, కోటేశ్వరరావు, వుపతల గోవిందు, ఎస్ కే ముస్తఫా,వెంకన్న, దుర్గారావు, రామన్న, శీలం వెంకన్న, తదితర కార్మిక సంఘాలు, కార్మికులు పాల్గొన్నారు.
ప్రతిజ్ఞ
భారత రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతాన్ని నిజం చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.
మన స్వాతంత్య్ర సమరయోధులు, కొనసాగుతున్న రైతుల ఆందోళనల అమరవీరుల నుండి ప్రేరణ పొంది, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం.
రైతులను, వ్యవసాయాన్ని, గ్రామాలను కార్పొరేట్ల చేతుల నుండి రక్షించడానికి, దేశం యొక్క ఆహార భద్రత, స్వావలంబనను కాపాడటానికి మా పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవడం, సి 2 + 50 శాతం కనీస మద్దతు ధరలకు అన్ని వ్యవసాయ పంటల కొనుగోలుకు హామీ కోసం చట్టం చేయడం కోసం పోరాటం చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము.
రైతులు బ్రతికి ఉంటేనే భారతదేశం మనుగడ సాగి బలంగా మారుతుందని మేము నమ్ముతున్నామని ప్రతిజ్ఞ చేశారు. రైతును రక్షించండి, దేశాన్ని కాపాడండి, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అన్నారు.