దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు విధించిన లాక్ డౌన్ ప్రయివేటు టీచర్ల పాలిట శాపంగా మారింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో తామతంపరగా పుట్టిఉన్న ప్రయివేటు స్కూళ్లలో లక్షలాది మంది టీచర్లు పని చేస్తున్నారు.
వారికి ఇచ్చే జీతం కూడా తక్కువే అయినా ఉపాధ్యాయ వృత్తిపై మమకారంతోనో, అవసరార్ధమో ప్రయివేటు స్కూళ్లలో పని చేస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు ఇచ్చిన సమయంలో టీచర్లకు జీతాలు నిలిపివేసే అలవాటు ఉంది. వేసవి సెలవుల్లో స్కూళ్లు మూసేస్తాం కాబట్టి మీకు జీతాలు ఇవ్వం అని చెప్పేవారు.
ఆ రెండు నెలలు వారిని ఉద్యోగాలలోనుంచి తీసేసి మళ్లీ స్కూళ్లు తెరవగానే వారినే తీసుకునేవారు. ఇది అన్యాయం అయినా టీచర్లు భరిస్తూ గత్యంతరం లేని పరిస్థితుల్లో కొనసాగుతూనే ఉన్నారు. కొందరు టీచర్లకు మాత్రమే వేసవి సెలవుల్లో పేపర్లు దిద్దే పని దొరికేది.
ఇలాంటి పరిస్థితులను మార్చేందుకు ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మరో మహమ్మారి ఆలోచన ప్రయివేటు టీచర్ల జీవితాన్ని బలితీసుకుంటున్నది. కరోనా కారణంగా స్కూళ్లను బంద్ పెట్టిన విషయం తెలిసిందే. స్కూళ్లను బంద్ పెట్టిన కారణంగా టీచర్లకు జీతాలు ఇవ్వడం లేదు.
కొన్ని స్కూళ్లు అయితే ఫిబ్రవరి జీతం కూడా ఇవ్వలేదు. ఫిబ్రవరి నుంచి జులై వరకూ జీతం లేకపోతే ఎలా బతకాలని ప్రయివేటు టీచర్లు ప్రశ్నిస్తున్నారు.
పేద వారికి, తెల్ల రేషన్ కార్డు లేనివారికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఇతోధికంగా సాయం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ లాంటి చిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదనే బాధ కూడా మరో వైపు ఉంది.