మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ రేపు ఖమ్మం రానున్న సందర్భంగా ఖమ్మం పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఇంచార్జ్ భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ పర్యవేక్షణలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు DCP మురళీధర్ తెలిపారు.
రేపు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి కేటీఆర్ తో సహా రాష్ట్ర మంత్రులు పలువురు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిన భద్రతా ఏర్పాట్లను గురువారం పరిశీలించారు.
అనంతరం మంత్రులు పర్యటించే పరిసర ప్రాంతాలలో బందోబస్తు నిర్వహించే పోలీసు అధికారులు, పోలీస్ సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చేందుకు TNGO’s ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో DCP పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా రోప్ పార్టీలు, స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా విధినిర్వహణలో విధివిధానాలపై పలు సూచనలు చేశారు. బందోబస్తు వివరాలను వెల్లడించారు.
బందోబస్తు విధుల్లో ఎనిమిది మంది ఏసీపీలు, 21 మంది సిఐలు, 44 మంది ఎస్సై లు, 107 మంది ఎఎస్సై లు, హెడ్ కానిస్టేబుళ్ళు, 343 మంది కానిస్టేబుళ్ళు, 98 మంది మహిళా పోలీసులు హోంగార్డులు, 174 మంది హోం గార్డులు, 2 సెక్షన్లు ఎఆర్ పోలీసులు, 4 స్పెషల్ పార్టీ బృందాలు మొత్తం 750 మంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
సమావేశంలో అడిషనల్ డీసీపీలు ( CTC) నాయక్, ప్రసాద్, టౌన్ ఏసీపీ అంజనేయులు, రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ రమేష్, ఏసీపీ వెంకట్రావు, జహాంగీర్ , ప్రసన్న కుమార్, పాల్గొన్నారు.