కరోనా రెండో దశ విపత్కర పరిస్థితుల్లో మానవాళి మనుగడకు మాస్కు ధరించడం శ్రీరామరక్షగా మారిందని అందుకే ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని నల్లగొండ టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఎస్.ఐ. ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డిలు అన్నారు.
గురువారం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్లపల్లిలో మాస్కులు ధరించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఫ్లెక్సీ బ్యానర్లు, ప్ల కార్డులతో అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మాస్కులు లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులకు మాస్కులు అందించి ఇంట్లో నుండి బయటికి వస్తే మాస్క్ తప్పక ధరించాలని సూచించారు.
మాస్క్ ధరించకపోతే జరిమానాలు, జైలు శిక్షలు తప్పవన్నారు. మద్యం తాగి వాహనం నడపడం ఎంత నేరమో మాస్కు ధరించకుండా కరోనా వ్యాప్తికి కారణం కావడం అంతకన్నా పెద్ద నేరమని చెప్పారు. ప్రజల సంరక్షణ, కరోనా వ్యాప్తి నియంత్రణ కోసమే ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిందని ప్రజలంతా పోలీస్ శాఖతో సహకరిస్తూ కరోనా నియంత్రణలో భాగస్వామ్యం వహించాలని సూచించారు. జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, శుక్రవారం నుండి మాస్క్ ధరించకపోతే జరిమానాలు, కేసుల నమోదు తప్పవని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో రూరల్ సిబ్బంది రమేష్, నాగేశ్వర్ రావు, నాగరాజు, హట్టి, వెంకట్రాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.