అనవసరంగా అరెస్టులు చేసి అనుమానితులపై కేసులపై కేసులు పెట్టే పోలీసు అధికారులకు చెంప పెట్టులాంటి తీర్పును బొంబాయి హైకోర్టు వెలువరించింది. ఒక కేసులో అరెస్టు చేసి వారు బెయిల్ పై బయటకు రాగానే మరో కేసు పెట్టి మళ్లీ జైలుకు పంపిన పోలీసులను బొంబయి హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది.
దీనికి సహకరించిన మేజిస్ట్రేట్ ను కూడా హైకోర్టు మందలించింది. అన్యాయంగా ఆరు రోజుల పాటు జైల్లో ఉంచిన ఇద్దరికి చెరో 50 వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2013 జనవరి 28న ఔరంగాబాద్ ప్రాంతంలోని బీడ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు. వెంటనే న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. తక్షణమే వారు బెయిల్ కు దరఖాస్తు చేయగా వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.
వారు విడుదలై జైలు నుంచి బయటకు రాగానే మరొక కేసు పెట్టి మళ్లీ న్యాయ మూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ సారి వ్యక్తిగత పూచీ కత్తు కింది షూరిటీ బాండ్ సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తాము విధించిన పూచీకత్తుగా నగదు చెల్లిస్తామని చెప్పినా న్యాయ మూర్తి వినిపెంచుకోలేదు.
షూరిటీ బాండ్ రావడానికి ఆరు రోజులు పట్టింది. దాంతో వారు ఆరు రోజుల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ విధంగా ఇద్దరు వ్యక్తుల ప్రాధమిక హక్కును కాలరాసే విధంగా ప్రవర్తించినందున పోలీసులు, న్యాయమూర్తి కూడా బాధ్యత వహించాలని బొంబయి హైకోర్టు తీర్పు చెప్పింది.
జస్టిస్ టి వి నల్వాదే జస్టిస్ ఎం జి సేవలేకర్ లతో కూడిన ఔరంగాబాద్ బెంచ్ ఈ మేరకు తీర్పు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. పోలీసులు కింది కోర్టు న్యాయమూర్తులు కూడా బాధ్యతతో వ్యవహరించాలని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. పోలీసులు దురుద్దేశ్యపూర్వకంగా వారిని అరెస్టు చేశారని కూడా బెంచ్ వ్యాఖ్యానించింది.