(సత్యం న్యూస్ ప్రత్యేకం)
ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో అసలేం జరుగుతోంది? విదేశాలకు వెళ్లి పోయిన మావోయిస్టు అగ్రనేత మళ్లీ స్వదేశానికి ఎందుకు వచ్చాడు? అదిలాబాద్ మావోయిస్టు అగ్రనేత గణపతి ఆరోగ్యం క్షీణించిందని ఆయన త్వరలోనే జన జీవన స్రవంతిలో కలుస్తారన్న ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అసలు ఆయన విదేశాలకు దేని కోసం వెళ్లారు? అక్కడ నుంచి ఎప్పుడు వచ్చారు? ఎందుకు వచ్చారు? అన్న ప్రశ్న ప్రతి మావోయిస్టు సానుభూతిపరులు లోనూ తలెత్తుతోంది. ఇది సమాధానం దొరకని ప్రశ్న గానే మిగిలిపోతుంది. మావోయిస్టు కేంద్ర కార్యదర్శి పదవి నుంచి తప్పకుండా గణపతి ప్రస్థానం సందేహంలో పడింది.
ఆయన స్థానంలో నంబాల కేశవరావు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఛత్తీస్ గఢ్ కు చెందిన ఓ సీనియర్ పోలీసు ఉన్నతాధికారి గణపతి ఆచూకీ పై సంచలన విషయం వెల్లడించారు.
ఆయన తన స్వగ్రామమైన జగిత్యాల జిల్లా కు చేరుకున్నారని అక్కడి నుండి మళ్లీ ఛత్తీస్ గఢ్ దండకారణ్యం లోకి అక్కడి నుంచి బీహార్ తర్వాత అక్కడి నుండి నేపాల్ వెళ్లాడని నేపాల్ నుంచి ఫిలిప్పీన్ వెళ్లిపోయాడని తన వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు.
గణపతి కోసం జల్లెడ పడుతున్న పోలీసులు
మావోయిస్టుల టెలిఫోన్ సంభాషణలపై నిఘా ఉంచగా తమకు ఈ విషయం తెలిసిందని ఆయన అన్నారు. చివరిసారిగా గణపతి ఛత్తీస్ గఢ్ లో కనిపించారని అన్నారు. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి కోసం పలు రాష్ట్రాల పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ కూడా అన్వేషిస్తుంది.
చివరి సారిగా 2017 లో బీహార్ లోని గయ ప్రాంతంలో సంచరించినట్లు గా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నేపాల్ మీదుగా ఫిలిప్పైన్స్ కు వెళ్లడం ఆ తర్వాత ఆయన అక్కడ ఉన్నట్లు విశ్లేషణలు ఉన్నాయి. గణపతి పై ఎన్ ఐ ఏ 15 లక్షల రివార్డు ప్రకటించింది.
వివిధ రాష్ట్ర ప్రభుత్వా లతో కలిపి ఆయన తలపై రూపాయలు 3.6 కోట్ల వరకు రివార్డు ఉంది. ఒకవేళ గణపతి విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించి ఉంటే సదరు పోలీసు అధికారి కథనం నమ్మదగినది అని పలువురు అంగీకరిస్తున్నారు. భారతీయులంతా బీహార్ ద్వారా రోడ్డు మార్గంలో నేపాల్ కి వెళ్లడం సర్వసాధారణమే. అక్కడ నుంచి విమానాల్లో పలు దేశాలకు వెళ్లడం పెద్ద విషయమేమీ కాదు. భారత దేశంలో అశాంతికి పాల్పడే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ సభ్యులు అదే పంథా అనుసరిస్తారు.
నేడు గణపతి నాడు కత్తుల సమ్మయ్య
గతంలో లొంగిపోయిన కరీంనగర్ జిల్లా కాచాపూర్ కు చెందిన కత్తుల సమ్మయ్య కూడా నక్సలైట్ల లో ఉండగా పలుమార్లు విదేశాలకు వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. అదే క్రమంలో లో దళం తో విభేదించి తోటి సభ్యుల ను కాల్చి చంపిన అనంతరం సమ్మయ్య పోలీసులకు లొంగిపోయాడు.
ఆ తర్వాత హైదరాబాద్ లో కొందరు అవినీతి ఉన్నత ఉన్నతాధికారుల పరిచయంతో రియల్ ఎస్టేట్ వ్యవహారలతో అనేక దంధాలు నడిపాడు. 2001లో కొలంబోలో జరిగిన విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించాడు.
అదిలాబాద్ అడవుల్లో కి మళ్ళీ రాష్ట్ర డీజీపీ పర్యటన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవులను జల్లెడ పట్టడానికి కారణం మావోయిస్టు కీలక నేత అడెళ్ళు అలియాస్ భాస్కరేనా….? కొమురం భీమ్ ఆసిఫాబాద్ లో డీజీపీ మహేందర్ రెడ్డి ఆకస్మికంగా పర్యటిస్తున్నారు.
ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లా ఇంచార్జ్ ఎస్పీ, రామగుండం సీపీ సత్యనారాయణతో సమావేశం అయ్యారు.
ఓ వైపు గణపతి లొంగిపోతున్నారన్న వార్తలు మరో వైపు ఆసిపాబాద్ జిల్లాలో మావోల అలజడి కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, మావోయిస్ట్ కీలక నేత అడెళ్లు అలియాస్ భాస్కర్ డైరీ నేపథ్యంలో డీజీపీ పర్యటన కీలకంగా మారింది.
భాస్కర్ డైరీలో కొందరు ఆదివాసీ నాయకుల పేర్లు తెరపైకి రావడం.. తాజాగా వారి పేర్లను ప్రకటించడంతో ఆదివాసీల నుండి వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలో డీజీపీ పర్యటన మరింత ఆసక్తిగా మారింది. డీజీపీ పర్యటనతో జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలుచేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
-సిరిగె రమేష్ శర్మ నిర్మల్ నుంచి