దళితులను చిన్న చూపు చూస్తూ వారిపై అన్యాయానికి తెగబడితే చూస్తూ ఊరుకోబోమని డిఎస్ మాస్ చైర్మెన్ దేవని సతీష్ మాదిగ అన్నారు. వంగూర్ మండలం డిండి చింతపల్లి గ్రామంలో దళిత యువకుడు రాంచందర్ హోటల్ కూల్చేసిన దుండగులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆయన ఈ విషయంపై కల్వకుర్తి డిఎస్పీ గిరిబాబు ను కలిసి జరిగిన సమస్యను వివరించారు. అనంతరం పట్టణంలోని ఆర్ బి ప్రభుత్వ అతిథి గృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ గత నెల 10వ తేదీన చింతపల్లి గ్రామంలో దుండగులు హోటల్ కూల్చివేస్తే నేటికీ బాధితునికి న్యాయం జరగలేదని అన్నారు.
స్ధానిక సర్పంచ్,ఎంపిటిసి ఎమ్మెల్యే,ఒక్కటై హోటల్ యజమాని రాజేందర్ ను వేధిస్తున్నారని అన్నారు. నిరుద్యోగి అయిన రాజేందర్ ను న్యాయం చేయడంలో పోలీసులు విఫలమయ్యారని అన్నారు.
పోలీసులు వెంటనే హోటల్ కూల్చేసిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధితుడి పక్షాన వంగూర్ పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
విలేకర్ల సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శులు మబ్బు సాయన్న మాదిగ,వీరస్వామి మాదిగ తదితరులు పాల్గొన్నారు.