రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ తెలంగాణ హౌజింగ్ బోర్డులో నివాసముంటున్న బాజా వెంకటేశ్వరరావు విశాఖపట్నంలో సివిల్ కాంట్రాక్టర్ గా చేస్తున్నాడు. మూడు నెలల క్రితం ఓ బెంజ్ బస్సును కొనుగోలు చేసి, బాజా ట్రావెల్స్ పేరుతో తిప్పుతున్నాడు.
ఆ బస్సుకు డ్రైవర్ గా నల్గొండ జిల్లా నకిరేకల్ కు చెందిన నిమ్మల యాదగిరి (37)ని పెట్టుకున్నాడు. ఆ బెంజి బస్సుతో ఈనెల 21 న బీహెచ్ఈఎల్ నుంచి భద్రాచలానికి మొదటి ట్రిప్పు వేయాల్సి ఉంది. అయితే ప్రయాణికులు లేకపోవడంతో యాదగిరి బీరంగూడలోనే బస్సును పార్కు చేశాడు.
రాత్రి వేళ వెళ్లడం ఎందుకనుకున్నాడో ఏమో నాగీ యాదగిరి అందులోనే, అక్కడే పడుకున్నాడు. తిరిగి 22 న రాత్రి 7:30 గంటల లోపు బస్సును ఎల్బీనగర్, చింతలకుంట చెక్పోస్ట్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్దకు తీసుకురావాలని యజమాని సూచించాడు. రాత్రి 8 గంటల సమయంలో యజమాని కుమారుడు వీరేంద్రనాథ్ ఫోన్ చేయగా చింతలకుంటలోనే పార్కు చేశానని డ్రైవర్ తెలిపాడు.
అక్కడ వారికి బస్సు కనపడలేదు. డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చిన వీరేంద్రనాధ్ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బస్సు కడ్తాల్ మీదుగా శ్రీశైలం వైపు వెళ్లినట్లుగా సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఆమనగల్ సమీపంలో బస్సును పార్కు చేసి పడుకున్న యాదగిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సును హైదరాబాద్ కు తరలించారు. యాదగిరి గతంలో ఎల్బీ నగర్లో పార్కు చేసిన సిమెంట్ లారీని అపహరించి సిమెంట్ బస్తాలను అమ్ముకున్న కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.