పాపం పోలీసులు మండుటెండలో కూడా పని చేస్తున్నారు. హెల్త్ ఎమర్జెన్సీని కూడా తమ భుజాలపై వేసుకుని శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూస్తున్నారు. ప్రజలకు నిజమైన రక్షకులుగా ఉంటున్నారు. మాట వినని వారిపై కేసులు పెడుతున్నారు.
పని లేకుండా రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు పెడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే 478 కేసులు నమోదు చేసిన పోలీసులు వేలాదిగా వాహనాలను జప్తు చేశారు. ప్రజలు లక్ష్మణ రేఖ దాటకుండా కట్టడి చేస్తున్నారు.
ఇప్పటికే నగరం మొత్తం మీద 7 లక్షల పైగా ఉన్న CCTV కెమెరాలలో, సైబరాబాద్ లో ఉన్న లక్షా పదిహేను వేల కెమెరాలను కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేశారు. వీటి ద్వారా రోడ్ల మీద ప్రజల కదలికలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.
ఇదే కాకుండా పలు ప్రాంతాల్లో డ్రోన్ ల ద్వారా ప్రజల కదలికలు పసిగట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు పోలీసు వారి అమ్ముల పొదిలో మరో సాంకేతిక అస్త్రం జత అయ్యింది. ఇదే “లాక్ డౌన్ వయొలేషన్ ట్రాకింగ్ అప్లికేషన్”. దీనిని తెలంగాణ పోలీసు శాఖ తయారు చేసింది.
అన్ని చెక్ పోస్టులలో ఉన్న అధికారులకు టాబ్ లలో దీన్ని ఇన్స్టాల్ చేశారు. ఎవరైనా ఒక వ్యక్తి రోడ్ మీదకు వచ్చిన వెంటనే సమీపంలో ఉన్న పోలీసు అధికారి అతని వివరాలు టాబ్ లో నమోదు చేస్తారు. ఆ వ్యక్తి ఆ ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే అది కూడా కేవలం అత్యవసరాల నిమిత్తం మాత్రమే బయటకు వెళ్లవచ్చు.
అది కూడా GO: 45, 46 లలో పేర్కొన్న నిబంధనల మేరకు, మోటార్ సైకల్ పై ఒక వ్యక్తి, కార్ లో డ్రైవరు కాక మరొక వ్యక్తికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ మూడు కిలోమీటర్ల పరిధిని దాటినట్లైతే ఆ వాహనాన్ని జప్తు చేసి, వారిపై “జాతీయ విపత్తుల నియంత్రణ చట్టం”, “అంటువ్యాధుల నివారణ చట్టం” “భారతీయ శిక్షా స్మృతి” మేరకు కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటారు.
దీన్ని అతిక్రమించిన వారికి 2 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా కూడా పడే అవకాశం ఉంది. జప్తు చేసిన వాహనం ఇప్పట్లో విడుదల చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ప్రజలు ఎవరైనా కూడ అనవసరంగా రోడ్ల మీదకు రావద్దు. ఒకవేళ అత్యవసరంగా రావాల్సి వస్తే, నిబంధనల మేరకు మాత్రమే రావాలి.
ప్రతి చిన్న అవసరానికి బయటకు రాకుండా కనీసం రెండు మూడు రోజుల పాటు సరిపోయేలా అన్ని రకాల నిత్యావసరాలను ఒకేసారి కొనుగోలు చేసుకోవాలి. ఈ విధంగా బయటకు తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిన వారు కూడా, ఖచ్చితంగా మాస్క్ ధరించాలి.
మనుషుల మధ్య కనీసం 3 మీటర్ల దూరం పాటించాలి. రోడ్ల మీద అనవసరంగా ఉమ్మ కూడదు. తరచుగా మీ చేతులను సబ్బు నీటితో శుభ్రంగా కడుక్కొవాలి. లేదా శానిటైజర్ ఉపయోగించ వచ్చు.
ఈ నిబంధనలు అన్ని మీ కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం ఇంకా మన సమాజ శ్రేయస్సు కోసం కాబట్టి ప్రజలందరూ సహకరించి, ఈ కరోనా రక్కసిని మన సమాజం నుండి పారదోలుదాo.
నిబంధనలను అతిక్రమించి రిస్క్ తీసుకోరాదని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.