కరోనా విపత్కర పరిస్థితులలో సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఐజి ఏ.వి. రంగనాధ్ హెచ్చరించారు.
ముఖ్యంగా రిమిడిసివర్, కరోనా టెస్టింగ్ కిట్స్ విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించిడం ద్వారా కొరత సృష్టించే వారిని గుర్తించి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
అలాంటి వ్యక్తుల సమాచారం డయల్ 100 ద్వారా, నల్లగొండ జిల్లా ఎస్పీ 9440795600 నెంబర్ కు మెసేజ్, వాట్స్ అప్ రూపంలో సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ఆక్సిజన్ సిలిండర్ల డిమాండ్ సైతం మరింత పెరిగే పరిస్థితులున్నాయని ఆక్సిజన్ సిలిండర్ల విషయంలోనూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అధిక చార్జీలు చేసే ఆసుపత్రుల పైనా చర్యలు తీసుకుంటాం
ఇక జిల్లా వ్యాప్తంగా కరోనా చికిత్సలు చేయడానికి అనుమతులు లేకున్నా చికిత్సలు చేస్తూ, వివిధ రకాల పరీక్షల పేరుతో ప్రజల నుండి డబ్బులు దండుకునే ఆస్పత్రులపై చర్యలకు వెనుకాడబోమని ఎస్పీ రంగనాధ్ స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రైవేట్ ల్యాబ్స్, స్కానింగ్ సెంటర్స్, ఆసుపత్రులలో నిర్ణిత ధరల కన్నా అధికంగా డబ్బులు తీసుకున్నా తమ దృష్టికి తీసుకురావాలని సీజ్ చేయడం లాంటి చర్యలు తప్పవని హెచ్చరించారు.
వైద్య శాఖ భాగస్వామ్యంతో తనిఖీలు
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, పోలీస్ శాఖ సంయుక్తంగా ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్స్, ప్రైవేట్, ఆసుపత్రులలో ల్యాబ్స్ పై తనిఖీలు నిర్వహిస్తామని అధిక చార్జీలు వసూలు చేసినట్లుగా తమ దృష్టికి వస్తే సంబంధిత ఆసుపత్రులు, ల్యాబ్స్ సీజ్ చేస్తామని తెలిపారు.
మానవత్వం ప్రదర్శించండి కరోనా విలయతాండవం చేస్తున్న వేళ వైద్యులు, ఆసుపత్రుల నిర్వాహకులు మానవత్వం, సేవా భావాన్ని ప్రదర్శించాలని కోరారు. ప్రజల ఆర్థిక పరిస్థితులు, సమాజంలో నెలకొన్న తాజా పరిస్థితుల్లో అందుకు అనుగుణంగా ప్రజలకు సేవలందించాలని ఆయన సూచించారు.