రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగు పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం విమానాలను వినియోగిస్తున్నది. ఆక్సిజన్ సరఫరా మెరుగు పరచుకునేందుకు విమానాలను వినియోగిస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది.
మూడు, నాలుగు రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను వినియోగిస్తున్నారు. అయినా సరిపోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఙప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను కేటాయించింది.
కేంద్రం కేటాయిస్తామని చెప్పిన దాంట్లో 70 టన్నుల వరకు మన రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న చిన్నచిన్న ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి ఉన్నాయి. మిగిలిన ఆక్సిజన్ను బళ్లారి, భిలాయ్, అంగుల్ (ఒడిశా), పెరంబుదూర్ నుంచి తీసుకోవాలని సూచించింది.
తెలంగాణకు అత్యంత సమీపంలోని బళ్లారి స్టీల్ప్లాంట్ నుంచి తెలంగాణకు కేటాయించింది 20 మెట్రిక్ టన్నులే. వైజాగ్ నుంచి దాదాపు ఇంతే కేటాయించారు. భిలాయ్, పెరంబుదూర్, అంగుల్ నుంచి ఆక్సిజన్ తెచ్చుకోవడం తేలికేమీ కాదు.
అవన్నీ దూరంగా ఉన్న ప్లాంట్లు. ఆయా ప్రాంతాలనుంచి ఆక్సిజన్ రావడానికి కనీసం మూడు రోజులు పడుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమాన సేవలను వినియోగించుకుంటుంది రాష్ట్రం. ఇందులో భాగంగా ఆక్సిజన్ ట్యాంకర్లతో హైదరాబాద్ నుంచి ఒరిస్సాకు విమానాలు బయలు దేరాయి.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.