కరోనా మహమ్మారి నివారణ లో భాగం గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలు దాటి వస్తున్న వారిని ప్రత్యేక వైద్య పరీక్షలు చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినా ఫలితం కనిపించలేదు. వైద్య పరీక్షలకు వలసదారులు సహకరించడంలేదు.
మరికొందరు వైద్య పరీక్షల నుంచి తప్పించుకోవడానికి రాజకీయ ఒత్తిళ్లు చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం నుంచి నాలుగు రోజుల క్రితం రాత్రి పూట కడప జిల్లా నందలూరు మండలం పాటూరు, ఎర్రిపాపాయ పల్లె, గంగేద్దుల కాలనీకి పెద్ద సంఖ్యలో వలసదారులు చేరుకున్నారు. తెలంగాణ లో పని చేసేవారి స్వగ్రామాలు అవి.
వారి రాకని తెలుసుకొని ఆరోగ్య కార్యకర్తలు గ్రామానికి చేరుకోగా రోడ్డుకు కంపలు అడ్డుగా వేశారు. వైద్య పరీక్షల కోసం గ్రామాల చేరుకున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి సహకరించకుండా అధికార పార్టీ నేతల సహకారంతో ఆరోగ్య సిబ్బందిని వెనక్కి పంపిస్తున్నారు.
పోలీసుల సహకారం తో మళ్ళీ గ్రామాల్లో కి చేరుకున్న వైద్య సిబ్బంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల సహకారం తో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మళ్ళీ గ్రామాల్లో కి రావడంతో, వలసదారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు.
ఈ ప్రాంతాలకు చెందిన వారు తెలంగాణా తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉపాధి కోసం తరలి వెళ్లారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యంలో వీరంతా అక్కడ నుంచి స్వగ్రామాలకు చేరు కుంటున్నారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ముందస్తుగా వైద్య పరీక్షలు చేయడం అనంతరం వారిని ఐసోలేషన్ లో ఉండం లేదా స్వీయ గృహ నిర్బంధం లో ఉంచే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
అందుకు కొందరు సహకరించకుండా మొండికేస్తున్నారు. వారిలో కొందరు ఇండ్ల నుంచి పారిపోయి పొలాల్లో దాక్కునట్టు సమాచారం. వీరికి రాజకీయ పార్టీల నేతలు వంత పాడడం తో వైద్య సిబ్బంది కూడా చేసేది లేక పంథా మార్చి సలహాలు సూచనలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు.