ఉద్యోగుల ఉద్యమంలోకి రాజకీయ పార్టీలు చేరాయని దీనివల్ల ఉద్యోగుల ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యమంలోకి పార్టీలను స్వాగతిస్తామని ఉద్యోగులే అంటున్నారు. అదే జరిగితే వారి ప్రయోజనాలు దెబ్బతింటాయని సజ్జల అన్నారు. ఉద్యోగులను ప్రతిరోజూ చర్చలకు ఆహ్వానించాల్సిన అవసరం లేదని.. వారితో చర్చలకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘చర్చలు జరిపితే సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యమంలో రాజకీయ పార్టీలు కూడా చేరాయి. ఉద్యోగులే బదిలీలు కోరుతున్నారు.. ప్రభుత్వ ప్రక్రియ ఎందుకు ఆపుతుంది. సమ్మె నోటీసు ఇచ్చారని ప్రభుత్వం బదిలీలు ఆపుతుందా? ’’అని సజ్జల అన్నారు. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగుల తదుపరి కార్యాచరణ ఏంటో తెలియదని సజ్జల తెలిపారు.