కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రాణాలు ఒడ్డి పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి శాల్యూట్ అంటున్నారు తెలంగాణ బిజెపి కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. నేడు ఆయన బిజెవైఎం నాయకులతో కలిసి నార్సింగిలో పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు ఆహార పదార్ధాలను అందచేశారు.
కరోనా మహమ్మారిని నిలువరించడంలో వారు చేస్తున్న సేవ అద్వితీయమని ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ క్లిష్ట సమయంలో అందరూ కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటించడం ఒక్కటే చేయగలిగిన పని అని ఆయన అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నందున పౌరులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఇప్పటికే సుధాకర్ రెడ్డి ఈ విధమైన సేవా కార్యక్రమాలను ఖమ్మం జిల్లా సత్తుపల్లి కొల్లూరు లలో నిర్వహించారు.
అదే విధంగా రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈ విధమైన సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా పిలుపు మేరకు ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు సుధాకర్ రెడ్డి వెల్లడించారు. ప్రజలంతా సోషల్ డిస్టెన్సింగ్ పాటించి కరోనాను అడ్డుకోవాలని ఆయన కోరారు.