తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సభ, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సిపిఎం జిల్లా ఆఫీస్ సుందరయ్య భవన్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది. ముందుగా దొడ్డి కొమరయ్య, అల్లూరి సీతారామరాజు చిత్రపటాలకు సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నవాబు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, విస్నూరు దేశముఖ్ల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన వీరోచిత పోరాటంలో నేలకొరిగిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్పూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నేటి ప్రభుత్వాలు వివిధ రకాల పన్నుల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా కొమరయ్య స్పూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు.
దొడ్డి కొమరయ్యను స్మరించుకొవడమంటే నాటి ఆంధ్ర మహాసభ ఏర్పాటు, దానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టులు, 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ, వేల గ్రామాలు వెట్టి, దోపిడీ నుండి విముక్తి, 4వేల మంది అమరుల ప్రాణ త్యాగాలు స్మరించుకొవడమే అని పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలో లిఖించదగిన పోరాటంగా, దేశంలో జరిగిన అనేక పోరాటాలకు స్ఫూర్తినిచ్చి, దేశంలో భూ సంస్కరణల (భూ పంపిణీ) చట్టం ఏర్పాటుకు, భూ సీలింగ్ చట్టం ఏర్పాటుకు పునాదిగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిలిచిందన్నారు.
భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు, మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి రెండేళ్ల పాటు బ్రిటిషర్లకు కంటిమీద కనుకులేకుండా చేసాడు అని అన్నారు. అల్లూరి సీతారామరాజు 1897 జులై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారు.
అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో రామరాజు తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి సంస్కృతం, జోతిష్యశాస్త్రం, జాతక శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారు. మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి, బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని మన్యం ప్రజలను పురిగొల్పారు. సీతారామరాజు ప్రధాన అనుచరుడు, సేనాని గంటందొర. ఈయనది నడిరపాలెం గ్రామం. గంటం దొర, మిగిలిన అనుచరుల సాయంతో బ్రిటిష్ అధికారులపై విప్లవానికి అల్లూరి తెరతీశారు.
బ్రిటిష్ ప్రభుత్వం మన్యం ప్రజలను కాల్చుకు తినడం మొదలుపెట్టింది. ప్రభుత్వం ప్రజలను పెడుతున్న కష్టాలను చూడలేని రాజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. నేటి బిజెపి ప్రభుత్వం నాటి పోరాటంలో అగ్రభాగాన నిలిచిన కమ్యూనిస్టులపైన దాడులు, జనసంఫ్, ఆర్.యస్.యస్ పేర్లతో భూస్వాములకు, జాగిర్ధార్లకు అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. భవిష్యత్తులో వివిధ కార్మిక, వ్యవసాయ చట్టాల మార్పుల ద్వారా కేంద్రం తెరలేపుతున్న దోపిడీకి వ్యతిరేకంగా అమరవీరుల స్ఫూర్తితో పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.