తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్నది. ఇప్పటికే నగరంలో లాక్ డౌన్ ప్రకటించి ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో బెడ్ల కొరత,ఆక్సిజన్ అందక అనేకమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎన్నడూ లేని విధంగా ఆసుపత్రిలో “అడ్మిషన్ల కొరకు సిఫార్సులు” చేయించుకునే దుస్థితి ఏర్పడింది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పరీక్షలు నిర్వహించడం తొందరపాటు చర్య అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి అనుగ్రహంతో త్వరగా ఈ విపత్తు నుంచి బయటపడి అన్నీ సవ్యంగా ఉన్న సమయంలో పరీక్షలు నిర్వహించేలా ఏపీ సీఎం కు సద్బుద్ధిని ప్రసాదించాలని ఆయన కోరారు.
అదే విధంగా హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల,ఉపాధ్యాయుల ప్రాణాలను పణంగా పెట్టి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక్క చిత్తూరు జిల్లాలో ఇటీవల 10 మందికి పైగా ఉపాధ్యాయులు వైరస్ కారణంగా చనిపోయారని ఆయన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న “ఉపాధ్యాయ సంఘాలు” ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నా కోవిడ్ బారినపడి అనేకమంది ఉపాధ్యాయులు చనిపోతున్నా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడం దుర్మార్గమని ఆయన తెలిపారు.